9, మే 2011, సోమవారం

మేఘసందేశం 50, 51 శ్లోకాలు.

బ్రహ్మావర్తం జనపదమథ చ్ఛాయయా గాహమానః
క్షేత్రం క్షత్రప్రథనపిశునం కౌరవం తద్భజేథాః,
రాజన్యానాం శితశరశతైర్యత్ర గాండీవధన్వా
ధారాపాతైస్త్వమివ కమలాన్యభ్యవర్ష న్ముఖాని.



భావం:



అనంతరం,

బ్రహ్మావర్తం అనే జనపదం ( దేశం ) మీదుగా,

క్షత్రియుల ( ధార్తరాష్ట్ర పాండవ ) యుద్ధానికి సూచకమైన,

కురుక్షేత్రాన్ని చేరు.

ఆ కురుక్షేత్రంలో అర్జునుడు,

వందలకొలది వాడివాజులతో ( పదునైన బాణాలతో )

జలధారలను పద్మాలపై నీవు, ఎలా వర్షిస్తావో

అలా రాజుల ముఖాలపై వర్షించాడు. ( కురిపించాడు.)




హిత్వా హాలామభిమతరసాం రేవతీలోచనాంకాం
బంధుప్రీత్యా సమరవిముఖో లాంగలీ యాః సిషేవే,
కృత్వా తాసామభిగమమపాం సౌమ్య సారస్వతీనా
మంతఃశుద్ధస్త్వమపి భవితా వర్ణమాత్రేణ కృష్ణః.



భావం :


బంధుప్రేమతో,

యుద్ధవిముఖుడైన బలరాముడు,

సురను ( మద్యం ) విడిచి,

సరస్వతీనదీజలాలను సేవించి, పరిశుద్ధుడయ్యాడు.

ఓ సౌమ్యుడా!

నీవూ, ఆ సరస్వతీనదీ ఉదకాలను సేవిస్తే,

నీ అంతరాత్మ పరిశుద్ధం అవుతుంది.

( అప్పుడు ) వర్ణంచేత మాత్రమే నల్లనివాడవు అవుతావు.



విశేషాలు:



పూర్వం, బలరాముడు, ఇరుపక్షాలూ బంధువులే కాబట్టి,

కురు పాండవ యుద్ధంలో ఎవరి పక్షాన చేరడానికీ ఇష్టపడక,

తీర్థయాత్రలకు వెళ్లిపోయాడు.

అప్పుడు తనకత్యంత ప్రియమైన సురను విడిచి,

(అసలు మద్యానికి హలిప్రియ అనే పేరు బలరామునివల్లే వచ్చింది.
హలి అంటే బలరాముడు. హలాన్ని (ఆయుధంగా) ధరించినవాడు = హలి
హలికి ఇష్టమైనది అనే అర్థంలో కల్లుకు హలిప్రియ అనే పేరు వచ్చింది.)

పరమపావనమైన సరస్వతీ జలాలను గ్రోలి, శుద్ధుడయ్యాడు.

ఈ కథను గుర్తుచేస్తున్నాడు.

ఓ మేఘుడా! ఆ ప్రాంతంలో సరస్వతీనది ఉంది. ఆ నదిని నీవు సేవిస్తే,

నీ శరీరవర్ణం అలాగే ఉన్నా, ఆ నదీజలప్రభావంతో నీ అంతరాత్మ పరిశుద్ధం అవుతుంది.

అంటున్నాడు.

శరీరపురంగును కాదు పట్టించుకోవలసింది.

ఉన్న నలుపు ఎంతమంది బ్యూటీషియన్స్ ను ఆశ్రయించినా,

ఎంత డబ్బు తగలేసినా పోదు.

కావలసినది , చేయవలసినది

నల్లగా ఉన్న మనసును తెల్లగా చేసుకోవడమే.

అదే అంతఃశుద్ధి.



మంగళం మహత్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sundarakanda సుందరకాండ 35

                                     రామసుందరం పఞ్చత్రింశస్సర్గః తాం తు రామకథాం శ్రుత్వా వైదేహీ వానరర్షభాత్‌ । ఉవాచ వచనం సాంత్వ మిద...