8, మే 2011, ఆదివారం

మేఘసందేశం 48 , 49 శ్లోకాలు

త్వయ్యాదాతుం జలమవనతే శార్ఙ్గిణో వర్ణచౌరే
తస్యాః సింధో పృథుమపి తనుం దూరభావాత్ప్రవాహం,
ప్రేక్షిష్యంతే గగనగతయో నూనమావర్జ్య దృష్టీ
రేకం ముక్తాగుణమివ భువః స్థూలమధ్యేంద్రనీలం.


భావం:


శ్రీకృష్ణుని వర్ణాన్ని ( కాంతిని,రంగును ) దొంగిలించిన

( అంటే కృష్ణుని కాంతి వంటి కాంతి గల ) నీవు,

ఆ చర్మణ్వతి నదిఒద్దకు పోయి,

నీటిని తీసుకోవడానికి,

వంగి, ఉన్నపుడు,

పెద్దదైనా దూరంగా ఉండటంవల్ల చిన్నదిగా ఉన్న ఆ నదీ ప్రవాహాన్ని,

పైన ఆకాశంలో పోయేవారు చూసి,

ఆ నదిని భూమి ధరించిన ఒంటిపేట ముత్యాలహారంగాను,

నిన్ను, ఆ ముత్యాలహారం నడుమ ( మధ్య ) కూర్చిన

ఇంద్రనీలమణిగాను భావిస్తారు.



విశేషాలు :



- శ్రీకృష్ణుడు ఇంద్రనీలమణిలా ఉంటాడు.

మేఘుని కూడా అలా వర్ణించడానికి

కృష్ణునికి మేఘునికి ఒక్క శరీరవర్ణంలో తప్ప పోలికలు లేకపోవడంతో,

కవి, మొదటే మేఘుని " శార్ఙ్గిణో వర్ణచౌరే త్వయి " = శ్రీకృష్ణుని వర్ణాన్ని దొంగిలించిన నీవు,

అని వర్ణించి, ( ఏదో ఒకటి ) కృష్ణునినుండి గ్రహించినందువల్ల,

కృష్ణభావం కలిగినవాడయ్యాడు కాబట్టి, అప్పుడు కవి,

మేఘుని ఇంద్రనీలమణిలా ఉన్నావన్నాడు.


ఇక్కడో ఆధ్యాత్మిక రహస్యం ఉంది.

విష్ణువు ఇరవైఒక్క అవతారాల్లో పది అవతారాలు ముఖ్యమైనవి.

అందులోనూ రామకృష్ణావతారాలు ప్రజలమధ్య గడిపి,

ప్రజలతో మమేకమైన అవతారాలు.

వీరిద్దరూ ఆచరించి చూపించిన ధర్మప్రతిపాదితమైన ఏ ఒక్క అంశాన్నైనా, లేక

వారిలో ఏ ఒక్క వర్ణాన్నైనా ( వర్ణం అనే పదానికి గుణం అని కూడా అర్థం ఉంది.)

మనం గ్రహిస్తే, మనం దైవభావాన్ని పొందినట్లే.

అలా గ్రహించడం చెప్పినంత అనుకొన్నంత సులువు కాదు.

అలా గ్రహించే క్రియనే మనవాళ్లు తపస్సు అన్నారు.

భగవంతుడు అని అనకుండా రామకృష్ణులు అని

ఎందుకు అనడమంటే వారూ మానవులవలె జీవితం గడిపారు కాబట్టి.

ఇక్కడ రాముడంటే సాకేతరాముడు.



- ఏరియల్ వ్యూ లో, మనకు నది తెల్లగా కనిపిస్తుంది.

కవికి ముత్యాలహారంలా కనబడుతుంది.

కవి దర్శనానికి మన ( కవులుకానివారి ) చూపులకు అదే తేడా.



తాముత్తీర్య వ్రజ పరిచితభ్రూలతావిభ్రమాణాం
పక్ష్మోత్క్షేపాదుపరివిలసత్కృష్ణశారప్రభాణాం,
కుందక్షేపానుగమధుకరశ్రీముషామాత్మబింబం
పాత్రీకుర్వందశపురవధూనేత్రకౌతూహలానాం.



భావం:


ఆ చర్మణ్వతీనదిని దాటి, వెళ్తూంటే,

దశపురస్త్రీలు నిన్ను కుతూహలంతో చూస్తారు.

ఇలా నిన్ను చూడడం వారికి వేడుక అవుతుంది.

వారి తీగల్లాంటి కనుబొమల విలాసాల్ని,

కొంచెం ధవళకాంతితో కూడిన నల్లనికాంతులుగలవి కావడంతో

మొల్లపూలవెంట కదిలే తుమ్మెదలకాంతిని అపహరించినవైన ( పోలిన )

వారి కనుఱెప్పల్ని,

నయనకాంతుల్ని చూడడం నీకు వేడుక అవుతుంది.



మంగళం మహత్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sundarakanda సుందరకాండ 35

                                     రామసుందరం పఞ్చత్రింశస్సర్గః తాం తు రామకథాం శ్రుత్వా వైదేహీ వానరర్షభాత్‌ । ఉవాచ వచనం సాంత్వ మిద...