18, డిసెంబర్ 2011, ఆదివారం

మేఘసందేశం 63 వ శ్లోకం

తత్రావశ్యం వలయకులిశోద్ఘట్టనోద్గీర్ణతోయం
నేష్యంతి త్వాం సురయువతయో యంత్రధారాగృహత్వం ,
తాభ్యో మోక్షస్తవ యది సఖే ఘర్మలబ్ధస్య న స్యాత్
క్రీడాలోలాః శ్రవణపరుషైర్గర్జితైర్భాయయేస్తాః .



భావం :


ఓ మిత్రుడా!

ఆ కైలాసమందు, వేల్పుటింతులు ( సురయువతులు )

నిన్ను తమ కంకణాల అంచులతో ఒత్తి, నిశ్చయంగా నీ నీటిని పిండుతారు.

ఈ ఎండాకాలంలో వారికి నీవు దొరికినందువల్ల

( నీ నీటి ఆటల్ని మరిగి )

వారు నిన్ను విడువరు.

అప్పుడు క్రీడాలోలురైన ఆ వేల్పుచేడియలను

వినడానికి కఠినాలైన నీ ఉఱుములతో భయపెట్టి, తప్పించుకొనిపో.




వివరణ :



చాల మనోహరమైన భావం కదూ!

మేఘానికి సంబంధించి ఎన్ని ఆలోచనలు చేయాలో అన్నీ చేశాడు కాళిదాసు.


యువతులు కాబట్టి కొంటెపనులు.


ఎండాకాలంలో నీటి ఆటలు అందరికీ ఇష్టమేగా!


కృత్రిమంగా నీటిధారల్ని సృష్టించి ఆనందించడం ఆ కాలంలో ఉందని తెలుస్తుంది.





చిన్న మనవి :

మేఘసందేశాన్ని
తెలుగులో అందించే గొప్ప సాహసాన్ని చేస్తున్నాను.
ఏవైనా తప్పులుంటే పండితులు తెలుప ప్రార్థన.
నేను, కాళిదాసును అర్థం చేసుకోవడంలో లోపాలేవైనా ఉంటే
నాకు తెలియజేస్తే దిద్దుకోగలవాడను.







మంగళం మహత్

10, డిసెంబర్ 2011, శనివారం

మేఘసందేశం 61 , 62 శ్లోకాలు

ఉత్పశ్యామి త్వయి తటగతే స్నిగ్ధభిన్నాంజనాభే
సద్యః కృత్తద్విరదరదనచ్ఛేదగౌరస్య తస్య ,
శోభా మద్రేః స్తిమితనయనప్రేక్షణీయాం భవిత్రీ
మంసన్యస్తే సతి హలభృతో మేచకే వాససీవ .




భావం :


ఏనుగుదంతంలా తెల్లగా ఉన్న ఆ కైలాసపర్వతసానువు మీద

నున్నగా నూఱబడిన కాటుకకాంతి లాంటి కాంతి కలిగిన నీవు నిలిచితివేని

బలరాముడు తన భుజం మీద నల్లని పట్టువస్త్రం ధరిస్తే, ఎలా ఉంటుందో

అలా చూసేవారికి కన్నుల పండువులా ఉంటావు.



హిత్వా తస్మి౯ భుజగవలయం శంభునా దత్తహస్తా
క్రీడాశైలే యది చ విహరేత్పాదచారేణ గౌరీ ,
భంగీ భక్త్యా విరచితవపుః స్తంభితాంతర్జలౌఘః
సోపానత్వం కురు మణితటారోహణాయాగ్రయాయీ .



భావం:


ఆ కైలాసాన

శివుడు పార్వతీదేవితో కలసి కాలినడకన విహరిస్తూంటే,

అప్పుడు ముందుగా పోయి,

నీ శరీరాన్ని స్తంభింపచేసుకొని, ( ఘనీభవించి )

ఆ జగన్మాత రత్నాలగట్లను ఎక్కబోయేటప్పుడు

మెట్లవరుసగా ఏర్పడు.

ఆ విధంగా అమ్మవారి అనుగ్రహానికి పాత్రుడవై కృతార్థుడవగుదువు.




వివరణ : విశేషాలు :



శివుడు నాగకంకణాన్ని విడచి, గౌరీదేవి చేయి పట్టుకొంటాడని

కవి వర్ణన.

దానికి కారణం పామును చూసి, ఆవిడ భయపడుతుందని

వ్యాఖ్యాత వివరణ.



మేఘుని శరీరంలో నీటిప్రవాహాన్ని ఘనీభవింపచేసుకోమంటున్నాడు.



తల్లిదండ్రుల విహారాన్ని చూడడం దోషం.

అందువల్ల వారు విహరిస్తున్నారు అని

తెలియగానే అక్కడే నిలబడక

ముందుగా పోయి,

వినమ్రుడవై మెట్లవరుసగా మారితే

నేల మీద మాత్రమే చూపు ఉంటుంది (క్రింది చూపు)

కాన దోషప్రాప్తి ఉండదని,

పైగా అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చని సూచన.



ఇక్కడో విశేషం ఉంది.

మనస్తత్త్వం ప్రకారం

స్త్రీ తన భర్తతో ఉన్నప్పుడు పూర్తి ఏకాంతాన్ని కోరుకొంటుంది.

అందుకు విరుద్ధమైతే ఆగ్రహిస్తుంది.

ఇంతకుముందు శివపార్వతుల ఏకాంత సమయంలోనే

( ఇంద్రుడు పంపగా ) అగ్ని వస్తాడు.

అప్పుడు పార్వతి శివుని నుండి దూరమయ్యి, దుఃఖించి, కోపించి,

క్రిందపడ్డ శివుని వీర్యాన్ని భరించమని శపిస్తుంది.

ఆ వీర్యాన్ని గర్భంలో ధరించిన అగ్ని దాన్ని భరించలేక

గంగకు ఇస్తాడు. ఆవిడ కూడా భరించలేక రెల్లుగడ్డి మీదకు త్రోయగా

శరవణభవుడు జన్మిస్తాడు.

అందువల్ల ఎందుకొచ్చిన గొడవని

మేఘుని యక్షుడు వినమ్రుడవై ఉండమన్నాడు.

అందువల్ల తల్లికి కోపం రాదని, అనుగ్రహిస్తుందని సెలవిస్తున్నాడు.




మంగళం మహత్

Sundarakanda సుందరకాండ 35

                                     రామసుందరం పఞ్చత్రింశస్సర్గః తాం తు రామకథాం శ్రుత్వా వైదేహీ వానరర్షభాత్‌ । ఉవాచ వచనం సాంత్వ మిద...