5, మే 2011, గురువారం

మేఘసందేశం 45 వ శ్లోకం

తత్ర స్కందం నియతవసతిం పుష్పమేఘీకృతాత్మా
పుష్పాసారైః స్నపయతు భవా న్వ్యోమగంగాజలార్ద్రైః,
రక్షాహేతో ర్నవశశిభృతా వాసవీనాం చమూనా
మత్యాదిత్యం హుతవహముఖే సంభృతం తద్ధి తేజః



క్షమించండి. మధ్యలో అడ్డు వచ్చినందుకు.
తెలుసు కదా! శ్లోకం మొదట ప్రకాశంగా అంటే బయటకు చదవండి.
ఎన్నిసార్లు? భయపడకండి. తప్పులు రాకుండా చదువగలిగేవరకు.
ఎందుకు? భావం బాగా అర్థమవుతుంది.
ఇంకా? సంస్కృతం అందం తెలుస్తుంది.
తెలుగువారికి సంస్కృతం ఎందుకంటారా ?
అన్నన్నా. అలా అనకండి.
ఇంగ్లీషు కంటే భారతీయభాష , దేవభాష, వేదభాష అయిన
సంస్కృతం తీసిపోయిందంటారా ?
పరాయి భాషలపై ఉన్న మోజులో కొంత శాతం
సంస్కృతంకోసం కేటాయించండి.
దాని కోసమే శ్లోకం. అయితే ఈ శ్లోకాలతోనే సంస్కృతం రాదు.
అభిరుచి కలుగవచ్చు కదా!
అలా అని ఇప్పటికే రకరకాలుగా పలుచన అయిపోయిన మన
మాతృభాషను నిర్లక్ష్యం చేయకండి.
దాని కోసమే భావం.
ఇక చిత్తగించండి.


భావం:



ఓ మేఘుడా!

దేవగిరిని చేరబోతున్నావు కదా!

అది కుమారస్వామి నిత్యనివాసస్థానం.

ఆ కుమారస్వామిని,

నీవు,

పుష్పమేఘుడవై ( పూలను వర్షించే మేఘంగా చేయబడిన దేహం కలవాడవై )

ఆకాశగంగాజలాలతో తడిసిన పుష్పాల ధారావర్షంచేత

అభిషేకం చెయ్యి.

ఆ కుమారస్వామి,

ఇంద్రుని సైన్యాన్ని రక్షించడంకోసం

నవశశిభృతుడు ( బాలచంద్రశేఖరుడు ) ( శివుడు ),

అగ్నిముఖమందు ఉంచిన

సూర్యుని అతిక్రమించిన తేజస్సుకదా!



విశేషాలు:



తారకాసురుడు అనే ఒక రాక్షసుని సంహరించడంకోసం,

బ్రహ్మాదిదేవతలు ప్రార్థించిన మీదట శివుడు, బ్రహ్మచర్యాన్ని వీడి,

పార్వతిని పరిణయమాడి, కొన్ని కారణాంతరాలచేత,

తన తేజోవంతమైన వీర్యాన్ని, జగన్మాతయందు కాక,

అగ్నియందు ఉంచాడు.

అంతటి అగ్ని కూడా ఆ తేజస్సును భరించలేక,

గంగయందు ఉంచాడు.

గంగ కూడా భరించలేక రెల్లుగడ్డిమీదకు తోయగా తోయజాక్షుడైన

కుమారుడు జన్మించాడు.

కృత్తికలచేత పెంచబడిన ఆ కార్తికేయుడు,

పార్వతి ప్రసాదంతో వేలాయుధుడై,

తారకాసురుని సంహరించాడు.

ఆ తరువాత దేవతల ప్రార్థనచే

పైన పేర్కొన్న దేవగిరిమీద నిత్యనివాసానికి అంగీకరించాడు.

అంటే సతతం, సదా, ఎల్లప్పుడు, ఆ దేవగిరిమీద కొలువై ఉంటాడు.



- కుమారస్వామి వృత్తాంతాన్ని కాళిదాసు "కుమారసంభవం" అనే

మహాకావ్యంగా రచించాడు.



- " దేవతల రక్షణ కోసం ఉద్భవించిన కుమారుని

నీవు పూజిస్తే సకలదేవతలు ఇంద్రునితో సహా నీకు అనుకూలురే అవుతారు.

అది నీకు రక్షణ హేతువు." అని మేఘునికి యక్షుడు సూచించినట్లు భావించవచ్చు.



- వర్షమేఘాన్ని పుష్పమేఘం అవ్వమంటున్నాడు. ఎంత అందమైన భావనో చూశారా!




మంగళం మహత్



ప్రతి భారతీయుడు, తన మాతృభాషను, సంస్కృతాన్ని
రెండు కళ్లుగా భావించాలి. అప్పుడు జ్ఞానం + విజ్ఞానం లభిస్తాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sundarakanda సుందరకాండ 35

                                     రామసుందరం పఞ్చత్రింశస్సర్గః తాం తు రామకథాం శ్రుత్వా వైదేహీ వానరర్షభాత్‌ । ఉవాచ వచనం సాంత్వ మిద...