26, మార్చి 2011, శనివారం

మేఘసందేశం 2 వ శ్లోకం

తస్మి న్నద్రౌ కతిచి దబలా విప్రయుక్త స్స కామీ
నీత్వా మాసా న్కనకవలయభ్రంశరిక్తప్రకోష్ఠః
ఆషాఢస్య ప్రథమదివసే మేఘ మాశ్లిష్టసానుమ్
వప్రక్రీడాపరిణతగజప్రేక్షణీయం దదర్శ 2


భావం : భార్యను ఎడబాసి ఉండడంచేత కృశించినవాడై,
ఆ (చిత్రకూట) పర్వతం మీద,
కొన్ని మాసాలు కష్టంగా గడిపాడు.
(ఇక్కడ కొన్ని అంటే ఎనిమిది మాసాలు అని గ్రహించాలి.
ఎందుకంటే ఇతడు మేఘునితో
సంవత్సరానికి ఇక నాలుగుమాసాలు ఉన్నాయని చెప్పబోతున్నాడు.)
అంతట ఆషాఢమాసం తొలిరోజునందు
ఆ కొండ చరియను కమ్ముకొని,
దరిని గోరాడు ఏనుగులా ఉన్న
మేఘాన్ని చూశాడు.

విశేషాలు :- కృశించాడు అని చెప్పక కాళిదాసు ఒక చమత్కారంగా, ఆ యక్షుని,
 " బంగారు కడియంజారడంవల్ల వట్టిదైన ముంజేయి గలవాడు" అని విశేషణం వేసి, వర్ణించాడు.
చేతినుండి కడియం జారిపోయేంతగా చేయి సన్నబడిపోయింది.
అనగా శరీరం కృశించింది. అని స్ఫురిస్తుంది. ఇదే కవిత్వం అంటే.

- ఎనిమిది మాసాలు అష్టకష్టాలను గుర్తుకు తెస్తుంది.
( ఎనిమిది అంటే సంస్కృతంలో అష్ట అనికదా!)

- మేఘదర్శనం అయింది అంటే
అంతకు ముందు ఆకాశం శూన్యంగా ఉందని కదా!
యక్షుని మనసులా.
తొలి అనే పదం (ప్రథమ) కూడా ,
ఎనిమిదిమాసాలు భార్య ఆలోచనలను తప్ప మరి దేన్నీ పట్టించుకోని అతడు మేఘాన్ని చూడగలిగాడు.
అంటే క్రొత్త ఆశ చిగురించిందన్న మాట.
మేఘం మొలకలు వేయిస్తుంది. చిగుళ్ళూ వేయిస్తుంది. నీటిని ఇచ్చి.

(ఇంకా ఆలోచించండి. మీకూ క్రొత్తభావాలు తడతాయి.)

భవదీయుడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sundarakanda సుందరకాండ 35

                                     రామసుందరం పఞ్చత్రింశస్సర్గః తాం తు రామకథాం శ్రుత్వా వైదేహీ వానరర్షభాత్‌ । ఉవాచ వచనం సాంత్వ మిద...