30, మే 2025, శుక్రవారం

Sundarakanda సుందరకాండ 38

 రామసుందరం అష్టత్రింశస్సర్గః

తతః స కపిశార్దూల స్తేన వాక్యేన హర్షితః |

సీతా మువాచ తచ్ఛ్రుత్వా వాక్యం వాక్యవిశారదః || 1

పిదప, వాక్యవిశారదుడైన హనుమంతుడు, సీత మాటలు విని, ఆ మాటలకు సంతోషించి, ఆమెతో, ఇలా అన్నాడు.

యుక్తరూపం త్వయా దేవి భాషితం శుభదర్శనే |

సదృశం స్త్రీస్వభావస్య సాధ్వీనాం వినయస్య చ || 2

“శుభదర్శనీ! నీవు చెప్పింది యుక్తంగా ఉంది. స్త్రీస్వభావానికి, పతివ్రతల వినయానికి తగిన విధంగా ఉంది.

స్త్రీత్వం న తు సమర్థం హి సాగరం వ్యతివర్తితుమ్ |

మా మధిష్ఠాయ విస్తీర్ణం శతయోజనమాయతమ్ || 3

నా వీపుపై ఎక్కి నూరు యోజనాల విశాలమైన సముద్రాన్ని దాటడం ఆడుదానివి కాన అలవి కాదు.

ద్వితీయం కారణం యచ్చ బ్రవీషి వినయాన్వితే |

రామాదన్యస్య నార్హామి సంస్పర్శమితి జానకి || 4

ఏతత్తే దేవి సదృశం పత్న్యా స్తస్య మహాత్మనః |

కా హ్యన్యా త్వామృతే దేవి బ్రూయా ద్వచన మీదృశమ్ || 5

రాముని తప్ప, ఇతరుని స్పర్శను అంగీకరింపను అని నీవు చెప్పిన రెండవ కారణం, మహాత్ముడైన ఆ రాముని భార్యవైన నీకే తగి ఉన్నది. నీవు తప్ప మరి స్త్రీ ఇలాంటి మాట చెప్పగలదు?.

శ్రోష్యతే చైవ కాకుత్స్థః సర్వం నిరవశేషతః |

చేష్టితం యత్త్వయా దేవి భాషితం మమ చాగ్రతః || 6

(ఉరికి ప్రయత్నించడం మొదలైన) నీ చేష్టలు, (రావణుని ధిక్కరించి చెప్పిన) నీ మాటలు మొత్తం రామునకు పూర్తిగా చెప్తాను.

కారణైర్బహుభిర్దేవి రామప్రియచికీర్షయా |

స్నేహప్రస్కన్నమనసా మయైతత్సముదీరితమ్ || 7

ఎన్నో కారణాలచేత, స్నేహంచేత నా మనస్సు కరగి, రామునకు ప్రియం చేయాలనే ఇచ్ఛచేత, నేనిలా (నిన్ను తీసుకొని వెళ్తానని) చెప్పాను.

లఙ్కాయా దుష్ప్రవేశత్వా ద్దుస్తరత్వాన్మహోదధేః |

సామర్థ్యాదాత్మనశ్చైవ మయైతత్సముదీరితమ్ || 8

లంకలో ప్రవేశించడం, మహాసముద్రాన్ని దాటడం చాల కష్టం. నాకు (నిన్ను తీసికొనిపోవడానికి) సామర్ధ్యం ఉంది. అందువల్ల నేనిలా చెప్పాను.

ఇచ్ఛామి త్వాం సమానేతుమద్యైవ రఘుబన్ధునా |

గురుస్నేహేన భక్త్యా చ నాన్యథై తదుదాహృతమ్ || 9

గొప్ప స్నేహంచేత, భక్తిచేత, ఇప్పుడే నిన్ను రాముని దగ్గరకు తీసికొనివెళ్లాలనే కోరికచేత ఇలా అన్నాను. వేఱు కాదు.

యది నోత్సహసే యాతుం మయా సార్థమనిన్దితే |

అభిజ్ఞానం ప్రయచ్ఛ త్వం జానీయాద్రాఘవో హి యత్ || 10

నాతో రావడానికి సమ్మతించకపోతే, రామునకు తెలిసే ఏదైనా గుఱుతును ఇయ్యి.

ఏవముక్తా హనుమతా సీతా సురసుతోపమా |

ఉవాచ వచనం మన్దం బాష్పప్రగ్రథితాక్షరమ్ || 11

హనుమంతుని మాటలు విని, సీత కన్నీటితో అక్షరాలు కూర్చిన మాటలతో మందంగా,

ఇదం శ్రేష్ఠమభిజ్ఞానం బ్రూయా స్త్వంతు మమ ప్రియమ్ |

శైలస్య చిత్రకూటస్య పాదే పూర్వోత్తరే పురా || 12

తాపసాశ్రమవాసిన్యాః ప్రాజ్యమూలఫలోదకే |

తస్మిన్ సిద్ధాశ్రమే దేశే మన్దాకిన్యా హ్యదూరతః || 13

తస్యోపవనషణ్డేషు నానాపుష్పసుగన్ధిషు |

విహృత్య సలిలక్లిన్నా తవాఙ్కే సముపావిశమ్ || 14

నీకు ఒకత్తమమైన గుఱుతు చెప్తాను. దానిని నీవు నా పెనిమిటికి చెప్పు. (“రామా!) పూర్వం చిత్రకూటపర్వత ఈశాన్యపాదం ఒద్ద గంగానదికి సమీపంలో మూలఫలోదకాలతో సమృద్ధమైన సిద్ధాశ్రితప్రదేశంలో ఋష్యాశ్రమంలో ఉండగా నేను, అక్కడ నానావిధపుష్పసుగంధాలు గుబాళించే వనాల్లో విహరించి, చెమటతో తడిసి, నీ ఒడిలో కూర్చొన్నాను.

తతో మాంససమాయుక్తో వాయసః పర్యతుండయత్ |

తమహం లోష్ట ముద్యమ్య వారయామి స్మ వాయసం || 15

ప్పుడు ఒక కాకి మాంసాన్ని ఆశించి, న్ను ముక్కుతో పొడిచింది. అప్పుడు నేను మంటిగడ్డను ఎత్తి ఆ కాకిని తోలాను.

దారయన్ స చ మాం కాక స్తత్రైవ పరిలీయతే |

న చాప్యుపారమ న్మాంసా ద్భక్షార్థీ బలిభోజనః || 16

ఆ కాకి నన్ను గీఱుతూ, అవతలికి పోక అక్కడే దాగి ఉంది. ఆహారం కోరే ఆ కాకి విడువకుండా నా మాంసాన్నితింటూనే ఉంది.

ఉత్కర్షన్త్యాం చ రశనాం క్రుద్ధాయాం మయి పక్షిణి |

స్రస్యమానే చ వసనే తతో దృష్టా త్వయా హ్యహమ్ || 17

అలా ఆ కాకిచే నా వస్త్రం వీడగా, నేను కోపించి, వస్త్రాన్ని దృఢం చేసుకోవడానికై మొలనూలు సవరించుకొంటూండగా నీవు నన్ను చూశావు.

త్వయాఽపహసితా చాహం క్రుద్ధా సంలజ్జితా తదా |

భక్షగృద్ధేన కాకేన దారితా త్వా ముపాగతా || 18

అప్పుడలా ఆ కాకిపై కోపంతో ఉన్న నన్ను నీవు పరిహసించావు. నేను  సిగ్గు పడ్డాను. ఆహారం కోసం ఆ కాకి నన్ను చీరగా నీ ద్దకు వచ్చాను.

ఆసీనస్య చ తే శ్రాంతా పున రుత్సంగమావిశమ్ |

క్రుధ్యంతీ చ ప్రహృష్టేన త్వయాఽహం పరిసాంత్వితా || 19

నేను అలసి, అక్కడే ఆసీనుడవై ఉన్న నీ ఒడిలో మళ్లీ కూర్చొన్నాను. కోపంతో ఉన్న నన్నప్పుడు నవ్వుతూ ఓదార్చావు.

బాష్పపూర్ణముఖీ మన్దం చక్షుషీ పరిమార్జతీ |

లక్షితాఽహం త్వయా నాథ వాయసేన ప్రకోపితా || 20

కాకి చేత ప్రకోపింపబడి, ముఖం కన్నీళ్లతో నిండగా,  మెల్లగా కళ్ళు తుడుచుకొంటున్న నన్ను నీవు చూశావు."

పరిశ్రమా త్ప్రసుప్తా చ రాఘవాంకేఽప్యహం చిరమ్ |

పర్యాయేణ ప్రసుప్తశ్చ మమాంకే భరతాగ్రజః || 21

(ఆంజనేయా!) నేను బాగా అలసిపోవడంతో రాముని ఒడిలో చాలసేపు నిద్రపోయాను. తర్వాత రాముడు నా ఒడిలో నిద్రించాడు.

స తత్ర పునరే వాథ వాయసః సముపాగమత్ |

తతః సుప్తప్రబుద్ధామ్ మాం రామస్యాంకాత్స ముత్థితామ్ || 22

 వాయసః సహసాగమ్య విదదార స్తనాంతరే |

పునః పున రథోత్పత్య విదదార స మాం భృశమ్ || 23

పిదప, కాకి మళ్లీ వచ్చింది. నిద్రనుండి మేల్కొని రాముని ఒడినుండి  లేచిన నా ఒద్దకు కాకి వచ్చినా స్తనమధ్య ప్రదేశాన్ని చీరింది. మళ్లీ మళ్లీ ఎగిరి, అది నన్ను ఎక్కువగా చీరింది.

తతః సముక్షితో రామో ముక్తైః శోణితబిందుభిః |

వాయసేన తత స్తేన బలవత్ క్లిశ్యమానయా || 24

                                         స మయా బోధితః శ్రీమాన్ సుఖసుప్తః పరంతపః |

స మాం దృష్ట్వా మహాబాహు ర్వితున్నాం స్తనయోస్తదా || 25

ఆశీవిష ఇవ క్రుద్ధః శ్వసన్ వాక్య మభాషత |

కేన తే నాగనాసోరు విక్షతం వై స్తనాంతరమ్ || 26

కః క్రీడతి సరోషేణ పఞ్చవక్త్రేణ భోగినా |

వీక్షమాణ స్తత స్తం వై వాయసం సమదైక్షత || 27  

నఖైః సరుధిరై స్తీక్ష్ణైర్మామేవాభిముఖం స్థితమ్ |

పుత్త్రః కిల స శక్రస్య వాయసః పతతాం వరః || 28

ధరాంతగతః శీఘ్రం పవనస్య గతౌ సమః |

తత స్తస్మి న్మహాబాహుః కోపసంవర్తితేక్షణః || 29

వాయసే కృతవాన్ క్రూరాం మతిం మతిమతాం వరః |

స దర్భం సంస్తరాద్గృహ్య బ్రాహ్మేణాస్త్రేణ యోజయత్ || 30

స దీప్త ఇవ కాలాగ్నిర్జజ్వాలాభిముఖో ద్విజమ్ |

స తం ప్రదీప్తం చిక్షేప దర్భం తం వాయసం ప్రతి || 31

తత స్తం వాయసం దర్భస్సోంబరేఽనుజగామ హ |

అనుసృష్ట స్తదా కాకో జగామ వివిధాం గతిమ్ || 32

లోకకామ ఇమం లోకం సర్వం వై విచచార హ |

స పిత్రా చ పరిత్యక్తః సురైశ్చ సమహర్షిభిః || 33

త్రీన్ లోకాన్ సంపరిక్రమ్య తమేవ శరణం గతః |

స తం నిపతితం భూమౌ శరణ్యః శరణాగతమ్ || 34

వధార్హమపి కాకుత్స్థః కృపయా పర్యపాలయత్ |

న శర్మ లబ్ధ్వా లోకేషు తమేవ శరణం గతః || 35

పరిద్యూనం విషణ్ణం చ స తమాయాంతమబ్రవీత్ |

మోఘం కర్తుం న శక్యం తు బ్రాహ్మమస్త్రం తదుచ్యతామ్ || 36

హినస్తు దక్షిణాక్షి త్వచ్ఛర ఇత్యథ సోఽబ్రవీత్ |

తతస్తస్యాక్షి కాకస్య హినస్తి స్మ స దక్షిణమ్ || 37

త్వా క్షిణం నేత్రం ప్రాణేభ్యః పరిరక్షితః |

రామాయ నమస్కృత్వా రాజ్ఞే దశరథాయ || 38

విసృష్టస్తేన వీరేణ ప్రతిపేదే స్వమాలయమ్ | 

అప్పుడు కారిన రక్తబిందువులతో రాముని దేహం తడిసింది. అంత, కాకి చేత బాగా బాధపడుతున్న నేను సుఖంగా నిద్రపోతున్నరాముని మేల్కొల్పాను. 

రాముడు అప్పుడు స్తనాలమీద పీడింపబడే నన్ను చూసి, కోపించిన  సర్పంలా నిట్టూరుస్తూ (బుసకొడుతూ) ఇలా అన్నాడు. 

"సీతా! నీ స్తనమధ్యంలో గాయం చేసినవాడెవడు? కోపించిన ఐదుతలల సర్పంతో ఆడేవాడెవడు?"

తర్వాత రాముడు నాలుగు వైపులా పరికించి, రక్తంతో కూడిన వాడియైన గోళ్ళతో నా ఎదుటనే ఉన్న కాకిని చూశాడు.

పక్షులలో మేటి అయిన కాకి ఇంద్రుని కొడుకు. పర్వతాంతర నివాసి. శీఘ్ర గమనంలో వాయుసమానుడు. (అని తర్వాత రాముని ద్వారా తెలిసింది.)

రాముడప్పుడు కోపసంవర్తితేక్షణుడై, కాకిని గట్టిగా శిక్షించాలనుకొన్నాడు.

దర్భాసనం నుండి ఒక దర్భను తీసి,  బ్రహ్మాస్త్రంచేత అభిమంత్రించాడు. వెలుగుతున్న  దర్భ ప్రళయకాలాగ్నిలా కాకికి ఎదురై ప్రజ్వలించింది.

మండుతున్న దర్భను రాముడు కాకి వైపు విసరగా దర్భ ఆకాశంలో కాకిని తఱుముకొంటూ వెళ్లింది.

దర్భ అనుసరించి వస్తుండగా కాకి అన్నిరకాలుగా పరుగెత్తింది. రక్షణ కోరుతూ లోకమంతా తిరిగింది.

కాకి మూడు లోకాలూ తిరిగి, తన తండ్రియైన ఇంద్రుడు, దేవతలు, మహర్షులు కూడా రక్షించలేమని విడచిపెట్టగా, చివరకు రామునే శరణు పొందింది.

చంపదగినదైనప్పటికీ, నేలపై పడి శరణుజొచ్చిన కాకిని శరణ్యుడైన రాముడు కృప చూపి రక్షించాడు. 

పరితాపం పొంది, విషణ్ణమైన కాకితో రాముడు, "బ్రహ్మాస్త్రాన్ని వ్యర్థం చేయడం శక్యం కాదు. కాబట్టి ఏం చేయాలో చెప్పు" అని అన్నాడు.

"నీ బాణం (బ్రహ్మాస్త్రం) నా కుడి కంటిని హింసించు గాక!" అని కాకి అంది. అప్పుడు దర్భ కాకి కుడికంటిని హింసించింది. అలా కాకి కుడికంటిని ఇచ్చి, ప్రాణాలు కాపాడుకొంది.

కాకి, రామునకు, దశరథునకు నమస్కరించి, రాముని అనుజ్ఞ తీసుకొని, తన నివాసానికి చేరింది.

మత్కృతే కాకమాత్రే తు బ్రహ్మాస్త్రం సముదీరితమ్ || 39

కస్మా ద్యో మాం హరేత్త్వత్తః క్షమసే తం మహీపతే |

స కురుష్వ మహోత్సాహః కృపాం మయి నరర్షభ || 40

త్వయా నాథవతీ నాథ హ్యనాథా ఇవ దృశ్యతే |

ఆనృశంస్యం పరో ధర్మ స్త్వత్త ఏవ మయా శ్రుతః || 41

జానామి త్వాం మహావీర్యం మహోత్సాహం మహాబలమ్ |

అపారపారమక్షోభ్యం గామ్భీర్యాత్సాగరోపమమ్ || 42

భర్తారం ససముద్రాయా ధరణ్యా వాసవోపమమ్ |

ఏవమస్త్రవిదాం శ్రేష్ఠః సత్త్వవాన్బలవానపి || 43

కిమర్థ మస్త్రం రక్షస్సు న యోజయతి రాఘవః |

న నాగా నాపి గన్ధర్వా నాసురా న మరుద్గణాః || 44

రామస్య సమరే వేగం శక్తాః ప్రతి సమాధితుమ్ |

తస్య వీర్యవతః కశ్చిద్యద్యస్తి మయి సంభ్రమః || 45

కిమర్థం న శరైస్తీక్ష్ణైః క్షయం నయతి రాక్షసాన్ |

భ్రాతు రాదేశ మాదాయ లక్ష్మణో వా పరంతపః || 46

కస్య హేతో ర్న మాం వీరః పరిత్రాతి మహాబలః |

యది తౌ పురుషవ్యాఘ్రౌ వాయ్వగ్నిసమతేజసౌ || 47

సురాణామపి దుర్ధర్షౌ కిమర్థం మాముపేక్షతః |

మమైవ దుష్కృతం కించి న్మహదస్తి న సంశయః || 48

సమర్థావపి తౌ యన్మాం నావేక్షేతే పరంతపౌ |

"రామా! నాకోసం కాకి మీద కూడా బ్రహ్మాస్త్రం ప్రయోగింపబడింది. (కానీ) నీనుండి నన్ను అపహరించిన వాడు మాత్రం ఎందుకో క్షమించబడుతున్నాడు.

మహోత్సాహం పూని, నామీద కృప చూపించు. నీవు నాకు నాథుడవై ఉన్నా నేను అనాథలా కనబడుతున్నాను. 

ధర్మాల్లోకెల్లా ఉత్తమధర్మం దయ అని నీవే కదా చెప్పావు. నీవు మహావీర్యశాలివి, మిక్కిలి ఉత్సాహవంతుడవు, మహాబలుడవు, అతిక్రమించలేనివాడవు, అక్షోభ్యుడవు, గాంభీర్యంలో సాగరంవంటివాడవు, సముద్ర పరివృత భూమండలానికంతటికీ  ప్రభుడవు, దేవేంద్రునకు నమానుడవు అని నాకు తెలుసు.”

రాఘవుడు విధంగా అస్త్రవేత్తలలో శ్రేష్ఠుడు, సత్యవంతుడు, బలవంతుడు అయినా రాక్షసుల మీద అస్త్రాన్ని ఎందుకు ప్రయోగించడం లేదు?

రాముని వేగాన్ని సహించడానికి నాగులు గాని, గంధర్వులు గాని, అసురులు గాని, దేవతాగణాలు గాని సమర్థులు కారు.

రామునికి నన్ను తీసుకొనిపోవాలని మాత్రమైనా తొందర ఉంటే, వాడి అయిన బాణాలతో రాక్షసుల నందఱ్నీ ఎందుకు చంపడం లేదు? 

లక్ష్మణుడైనా అన్నగారి ఆజ్ఞ తీసుకొని, నన్ను ఎందుకు కాపాడడంలేదు?

సమర్థులై ఉండీ, రామలక్ష్మణులు ఎందుకు నన్ను ఉపేక్షిస్తున్నారు. దానికి నేను చేసిన మహా పాపమే కారణం. సందేహం లేదు."

వైదేహ్యావచనం శ్రుత్వా కరుణం సాశ్రుభాషితమ్ || 49

అథాబ్రవీ న్మహాతేజా హనుమాన్ మారుతాత్మజః |

త్వచ్ఛోకవిముఖో రామో దేవి సత్యేన తే శపే || 50

రామే దుఃఖాభిపన్నే లక్ష్మణః పరితప్యతే |

కథంచి ద్భవతీ దృష్టా కాలః పరిశోచితుమ్ || 51  

ఇమం ముహూర్తం దుఃఖానాం ద్రక్ష్యస్యంత మనిందితే |

తావుభౌ పురుషవ్యాఘ్రౌ రాజపుత్రౌ మహాబలౌ || 52

త్వద్దర్శనకృతోత్సాహౌ లంకాం భస్మీకరిష్యతః |

త్వా సమరే క్రూరం రావణం సహబాంధవమ్ || 53

రాఘవ స్త్వాం విశాలాక్షి నేష్యతి స్వాం పురీం ప్రతి |

బ్రూహి  యద్రాఘవో వాచ్యో లక్ష్మణశ్చ మహబలః || 54

సుగ్రీవో వాపి తేజస్వీ హరయోపి సమాగతాః |

కన్నీళ్లు కారుస్తూ, సీత మాట్లాడిన మాటలు విని, హనుమ ఇలా అన్నాడు.

దేవి! నీ దుఃఖంతో రాముడు అన్నిటి యందు విముఖుడై ఉన్నాడు. నేను సత్యముతో శపథం చేస్తున్నాను. రాముడు  దుఃఖిస్తున్నప్పుడల్లా లక్ష్మణుడు కూడా దుఃఖిస్తున్నాడు.

ఎలాగోలా నిన్ను చూశాను. ఇది శోకించే సమయం కాదు. త్వరలోనే నీ దుఃఖాలు నశిస్తాయి.

రామలక్ష్మణులు నిన్ను చూడాలనే ఉత్సాహంతో ఉన్నారు. లంకను భస్మం చేసివేస్తారు.

రాముడు యుద్ధంలో రావణాసురుని బంధువులతో సహా సంహరించి, నిన్ను అయోధ్యకు తీసుకొని వెళ్తాడు. 

రామలక్ష్మణులకు, సుగ్రీవునకు ఇతర వానరులకు ఏమి చెప్పాలో చెప్పు.”

ఇత్యుక్తవతి తస్మింస్తు సీతా సురసుతోపమా || 55

ఉవాచ శోకసంతప్తా హనుమంతం ప్లవంగమమ్ |

కౌసల్యా లోకభర్తారం సుషువే యం మనస్వినీ || 56

తం మమార్థే సుఖం పృచ్ఛ శిరసా చాభివాదయ |

హనుమంతుని మాటలు విని సీత శోకంతో బాధపడుతూ ఇలా అంది. 

ఉత్తమమైన మనస్సు గల కౌసల్య లోకనాయకుడైన   రాముని కనెనో రామునకు నా పక్షాన శిరస్సు వంచి నమస్కారం చేసి సుఖాన్ని అడుగు.

స్రజశ్చ సర్వరత్నాని ప్రియాయాశ్చ వరాంగనాః || 57

ఐశ్వర్యం చ విశాలాయాం పృథివ్యా మపి దుర్లభమ్ |

పితరం మాతరం చైవ సంమాన్యాభిప్రసాద్య చ || 58

అనుప్రవ్రజితో రామం సుమిత్రా యేన సుప్రజాః |

ఆనుకూల్యేన ధర్మాత్మా త్యక్త్వా సుఖమనుత్తమమ్ || 59

అనుగచ్ఛతి కాకుత్స్థం భ్రాతరం పాలయన్వనే |

సింహస్కన్ధో మహాబాహు ర్మనస్వీ ప్రియదర్శనః || 60

పితృవద్వర్తతే రామే మాతృవన్మాం సమాచరన్ |

హ్రియమాణాం తదా వీరో న తు మాం వేద లక్ష్మణః || 61

వృద్ధోపసేవీ లక్ష్మీవాన్ శక్తో న బహుభాషితా |

రాజపుత్త్రః ప్రియశ్రేష్ఠః సదృశః శ్వశురస్య మే || 62

మమ ప్రియతరో నిత్యం భ్రాతా రామస్య లక్ష్మణః |

నియుక్తో ధురి యస్యాం తు తాముద్వహతి వీర్యవాన్ || 63

యం దృష్ట్వా రాఘవో నైవ వృత్తమార్యమనుస్మరేత్ |

స మమార్థాయ కుశలం వక్తవ్యో వచనాన్మమ || 64

మృదుర్నిత్యం శుచిర్దక్షః ప్రియో రామస్య లక్ష్మణః |

సుమిత్రకు సుపుత్రుడైన లక్ష్మణుడు, మాలికలను, ఉత్తమభోగ్యవస్తువులను, ప్రియమైన ఉత్తమస్త్రీలను, ఐశ్వర్యాన్ని విడచి, తల్లితండ్రులను పూజించి, వారిని ప్రసన్నులను చేసుకొని, రామునితో కలసి వనవాసానికి వచ్చాడు.

ధర్మాత్ముడైన లక్ష్మణుడు, గొప్పసుఖాన్ని వదలుకొని, రాముని పాలించుకొంటూ, వెంబడించి వచ్చాడు.

ప్రియదర్శనుడైన లక్ష్మణుడు నన్ను తల్లిలా, రాముని తండ్రిలా చూసుకొంటున్నాడు.

వీరుడైన లక్ష్మణునకు అప్పుడు నన్ను రావణుడు అపహరిస్తున్నట్లు తెలియదు. అతడు పెద్దలను సేవించువాడు. శ్రీమంతుడు. సమర్థుడు. అధికంగా మాటలాడడు. నా మామగారికి తగినవాడు. ఇష్టుడు. శ్రేష్ఠుడు.

లక్ష్మణుడు రామునకు తమ్ముడు. నిత్యం నాకు సంతోషం కలిగించేవాడు. ఆతనికి అప్పచెప్పిన పనిని చక్కగా నెఱవేర్చేవాడు. 

లక్ష్మణుని చూస్తూ రాముడు కాలంచేసిన తన తండ్రిని కూడ స్మరించడో అట్టి లక్ష్మణునితో నాకై, నామాటగా క్షేమం అడుగు.

లక్ష్మణుడు, మెత్తని స్వభావం కలవాడు. నిత్యం పవిత్రంగా ఉండేవాడు. దక్షుడు. రామునకు ఇష్టుడు.

యథా హి వానరశ్రేష్ఠ  దుఃఖక్షయకరో భవేత్ || 65   

త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ |

రాఘవస్త్వత్సమారంభాన్మయి యత్నపరో భవేత్ || 66   

ఇదం బ్రూయాశ్చ మే నాథం శూరం రామం పునః పునః |

జీవితం ధారయిష్యామి మాసం దశరథాత్మజ |

ఊర్ధ్వం మాసా న్నజీవేయం సత్యే నాహం బ్రవీమి తే || 67

రావణేనోపరుద్ధాం మాం నికృత్యా పాపకర్మణా |

త్రాతు మర్హసి వీర త్వం పాతాళాదివ కౌశికీమ్ || 68

వానరశ్రేష్ఠుడా! రాముడు నా దుఃఖాన్ని పోగొట్టేలా  పనిని నెఱవేర్చడానికి నీవే ప్రమాణమైనవాడవు.

నీ ప్రయత్నాన్ని బట్టే రాముడు నాకొఱకు ప్రయత్నం చేస్తాడు. 

నారామునితో మాట మాత్రం మాటిమాటికీ చెప్పు. "రామా! నేను ఒక్క మాసం మాత్రమే జీవిస్తాను. నెల తర్వాత జీవించను. సత్యం చెప్తున్నాను. 

వీరా! పాపకర్ముడైన రావణునిచే నికృత్యబంధనం పొందిన నన్ను పాతాళంనుండి కౌశికిని రక్షించినట్లు రక్షించాలి."

తతో వస్త్రగతం ముక్త్వా దివ్యం చూడామణిం శుభమ్ |

ప్రదేయో రాఘవాయేతి సీతా హనుమతే దదౌ || 69

తర్వాత సీత, వస్త్రంలో కట్టబడి ఉన్న శుభమైన దివ్యమైన చూడామణిని ముడివిప్పి తీసి, రామునకు ఇమ్మని చెప్తూ, హనుమంతునికి ఇచ్చింది.

ప్రతిగృహ్య తతో వీరో మణిరత్న మనుత్తమమ్ |

అంగుళ్యా యోజయామాస న హ్యస్య ప్రాభవద్భుజః || 70

హనుమంతుడు చూడామణిని తీసుకొని, భుజాన ఇమడదు కాన చేతికి తొడుక్కొన్నాడు.

(అయితే రామాయణం ప్రాచ్యపాఠంలో

"సా నిరీక్ష్య తతః సర్వం వేణ్యాం గ్రథితముత్తమమ్,

విముచ్య ప్రదదౌ తస్మై మణిరత్నం హనూమతే. 

దేయోఽయం రాఘవాయేతి సీతా సురసుతోపమా

సీత అటు ఇటు చూసి పరిశీలించి, తన వేణిలో ఉన్న మణిరత్నాన్ని  తీసి,“ఇది రామునకిమ్మని హనుమంతున కిచ్చింది.

“'ప్రతిగృహ్య”' ఇత్యాది శ్లోకం లేదు.)

మణిరత్నం కపివరః ప్రతిగృహ్యాభివాద్య చ |

సీతాం ప్రదక్షిణం కృత్వా ప్రణతః పార్శ్వతః స్థితః || 71

హనుమంతుడు, చూడామణిరత్నాన్ని గ్రహించి, సీతాదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి, వినయంగా ప్రక్కన నిలబడ్డాడు.

హర్షేణ మహతా యుక్తః సీతాదర్శనజేన సః |

హృదయేన గతో రామం శరీరేణ తు విష్ఠితః || 72

సీతాదర్శనం లభించినందుకు చాల సంతోషించిన హనుమంతుని హృదయం రాముని ఒద్దకు వెళ్లిపోయింది. శరీరం మాత్రం అక్కడ నిలచి ఉంది.

మణివర ముపగృహ్య తం మహార్హం

జనకనృపాత్మజయా ధృతం ప్రభావాత్ |

గిరిరివ పవనావధూతముక్తః

సుఖితమనాః ప్రతిసంక్రమం ప్రపేదే || 73

సీతాదేవి ధరించిన శ్రేష్ఠాతిశ్రేష్ఠమైన   చూడామణిని తీసుకొనగానే (హనుమంతుడు) దాని ప్రభావంవల్ల గాలిచేత కదల్చబడి నిలద్రొక్కుకొన్న పర్వతంలా సుఖించినవాడై, తిరుగుప్రయాణానికి ఆలోచించాడు.

(అయితే ప్రాచ్యపాఠంలో 

మణివరముపగృహ్య తం మహార్హం

జనకనృపాత్మజా (జయా) ధృతం పురస్తాత్, 

ద్రుమ ఇవ పవనావధూతమూర్తిః

క్షుభితతనుర్హనుమాన్ కృతస్తదానిమ్

హనుమ శరీరం గాలిచే కదల్చివేయబడిన చెట్టులా గజగజలాడిపోయింది. చూడామణిద్వారా తల్లి శక్తి సంక్రమించడంవల్ల ఏర్పడిన అవస్థ అది. శక్తే శత్రునాశనానికి ఆధారమైంది.)

------------------------------------------------

ఆనందరామాయణాంతర్గత

శ్రీరామాష్టకం

 

వేదాంతగానం సకలైస్సమానం, హృతారిమానం త్రిదశప్రధానమ్,

గజేంద్రయానం విగతావసానం, శ్రీరామచంద్రం సతతం నమామి. 5

 

ఇత్యార్షే శ్రీమద్వాల్మీకిరామాయణే ఆదికావ్యే సుందరకాండే అష్టత్రింశస్సర్గః (38)

 

మంగళం మహత్

 

 

 

 


Sundarakanda సుందరకాండ 38

  రామసుందరం – అష్టత్రింశస్సర్గః తతః స కపిశార్దూల స్తేన వాక్యేన హర్షితః | సీతా మువాచ తచ్ఛ్రుత్వా వాక్యం వాక్యవిశారదః || 1 పిదప , వాక్యవ...