19, మే 2011, గురువారం

మేఘసందేశం 56 వ శ్లోకం

యే సంరంభోత్పతనరభసాః స్వాంగభంగాయ తస్మి౯ ( ౯ గుర్తును న్ అని చదవాలి )

ముక్తాధ్వానం సపది శరభా లంఘయేయుర్భవంతం,

తాన్కుర్వీథాస్తుములకరకావృష్టిపాతావకీర్ణా౯

కే వా న స్యుః పరిభవపదం నిష్ఫలారంభయత్నాః.




భావం:



ఆ హిమాద్రిమీద,

నిన్ను చూసి, ఏనుగు అని భ్రమసి, తొందరపాటుతో

శరభ మృగాలు ( ఇవి ఒక రకమైన గిరిమృగాలు )

నీమీద అతివేగంగా దూకుతాయి.

నీ మీద పడకుండా , తటాలున తప్పుకో.

అప్పుడు అవి ఒళ్లు విరిగేటట్లు క్రింద పడతాయి.

ఆ తర్వాత నీవు, వాటిపై దట్టంగా వడగండ్ల వాన కురిపించు.

పనికిమాలినపని చేసేవారెవరైనా తిరస్కారానికి గురి అవుతారు.

గౌరవింపబడరు. అవమానింపబడతారని భావం.




మంగళం మహత్

17, మే 2011, మంగళవారం

మేఘసందేశం 55 వ శ్లోకం

తం చేద్వాయౌ సరతి సరళస్కంధసంఘట్టజన్మా
బాధేతోల్కాక్షపితచమరీవాలభారో దవాగ్నిః,
అర్హస్యేనం శమయితుమలం వారిధారాసహస్రైః
రాపన్నార్తిప్రశమనఫలాః సంపదో హ్యుత్తమానాం.


భావం:


గాలివల్ల దేవదారువృక్షాల బోదెలు ఒరుసుకొని దావాగ్ని పుట్టి,

దాని నిప్పురవ్వలు చమరీమృగాల తోకవెంట్రుకలను కాల్చి,

హిమవత్పర్వతాన్ని బాధించెనేని,

వేలజలధారలతో ఆ దావాగ్నిని, చల్లార్చు.

ఆపన్నుల ( ఆపదనొందినవారి ) కష్టాన్ని తీర్చడమే కదా!

ఉత్తముల సంపదలకు ఉన్న ఫలం.



వివరణ :


ఉత్తములు, ఉపకర్తలు, సజ్జనులు, పరోపకారులు, మహాత్ములు, బుధులు

వీరివద్ద సంపద ఉంటే దాన్ని తిరిగి

అవసరమై, అడిగినవారికోసమే ఉపయోగిస్తారు.

తమకోసం దాచుకోరు.

అర్థించకపోయినా అవసరం తెలుసుకొని మరీ సహాయం చేస్తారు.



"కమలాలు అడిగాయనే సూర్యుడు వాటిని వికసింపజేస్తున్నాడా!

కలువలు ప్రార్థించాకే చంద్రుడు వాటికి సంతోషం కలిగిస్తున్నాడా!" అంటాడు భర్తృహరి.



పరోపకారాయ ఫలంతి వృక్షాః

పరోపకారాయ వహంతి నద్యః,

పరోపకారాయ చరంతి గావః

పరోపకారార్థ మిదం శరీరం.



మంగళం మహత్

15, మే 2011, ఆదివారం

మేఘసందేశం 54 వ శ్లోకం

ఆసీనానాం సురభితశిలం నాభిగంధైర్మృగాణాం
తస్యాః ఏవ ప్రభవ మచలం ప్రాప్య గౌరం తుషారైః,
వక్ష్యస్యధ్వశ్రమవినయనే తస్య శృంగే నిషణ్ణః
శోభాం శుభ్రత్రినయనవృషోత్ఖాతపంకోపమేయాం.



భావం :



ఆ గంగానది హిమవంతం దగ్గరే ఉంటుంది.

ఆ హిమవత్పర్వత శిలలపై కస్తూరిమృగాలు కూర్చొంటాయి కాబట్టి

వాటి బొడ్డుల్లోని కస్తూరిగంధంతో ఆ అద్రి శిలలు పరిమళాలు క్రమ్ముతూంటాయి.

ఆ గంగానది పుట్టుకకే కారణమైన ఎక్కువ మంచుతో

ఆ గిరి, తెల్లగా కనబడుతూంటుంది.

అటువంటి పవిత్రమైన ఆ హిమవత్పర్వతశిఖరమందు కూర్చొంటే,

నీకు మార్గాయాసం తీరుతుంది.

తెల్లని ఆ కొండమీద కూర్చొన్న నల్లని నీవు,

శివుని వృషభం కుమ్మితే కొమ్మున అంటుకొన్న బురదమట్టిలా

బాగుంటావు.



మంగళం మహత్

14, మే 2011, శనివారం

మేఘసందేశం 53 వ శ్లోకం

తస్యాః పాతుం సురగజ ఇవ వ్యోమ్ని పశ్చార్ధలంబీ
త్వం చేదచ్ఛస్ఫటికవిశదం తర్కయేస్తిర్యగంభః,
సంసర్పంత్యా సపది భవతః స్రోతసి చ్ఛాయయా౭సౌ
స్యాదస్థానోపగతయమునాసంగమేవాభిరామా.








భావం:


స్వచ్ఛమైన స్ఫటికంలా శుభ్రమైన

ఆ గంగానది నీటిని త్రాగడానికి,

నీవు, సగం శరీరం వంచినపుడు,

చూడడానికి దిగ్గజంలా ఉంటావు.

నీ నీడ ఆ గంగాప్రవాహమందు వ్యాపించి,

చోటు గాని చోట ( అంటే ప్రయాగలోనే కాక ఇక్కడ కూడా )

యమునానది ఈ నదితో కూడినదా అన్నట్లు

చూడ సుందరంగా ఉంటుంది.




మంగళం మహత్

10, మే 2011, మంగళవారం

మేఘసందేశం 52 వ శ్లోకం

తస్మాద్గచ్ఛేరనుకనఖలం శైలరాజావతీర్ణాం
జహ్నోః కన్యాం సగరతనయస్వర్గసోపానపంక్తిం,
గౌరీవక్త్రభ్రుకుటిరచనాం యా విహస్యేవ ఫేనైః
శంభోః కేశగ్రహణమకరోదిందులగ్నోర్మిహస్తాః.



భావం:



ఆ కురుక్షేత్రంనుండి, బయలుదేరితే

కనఖలం అనే పర్వతం కనబడుతుంది.

హిమవంతంనుండి, దాని సమీపంలో గంగానది దిగింది.

తరువాత జహ్నుకన్య అయింది.

సగరచక్రవర్తిపుత్రులు స్వర్గానికి పోవడానికి మెట్లవరుసలా మారిన

పుణ్యరాశి అయిన అటువంటి గంగానదిని సేవించు.

శివుని శిరసున ఉన్న ఆ గంగ ( తన సవతి ) పార్వతిని పరిహాసం చేసినట్లుంటుంది.

హిమవంతంలో పుట్టి,

తనలో మునిగిన వారికి పుణ్యాన్ని ఇచ్చి,

సవతిని తలదన్ని, భర్త తలమీద ఉండే సౌభాగ్యాన్ని పొందిన

గంగను సేవిస్తే, నీకు మంచిది.


మంగళం మహత్

9, మే 2011, సోమవారం

మేఘసందేశం 50, 51 శ్లోకాలు.

బ్రహ్మావర్తం జనపదమథ చ్ఛాయయా గాహమానః
క్షేత్రం క్షత్రప్రథనపిశునం కౌరవం తద్భజేథాః,
రాజన్యానాం శితశరశతైర్యత్ర గాండీవధన్వా
ధారాపాతైస్త్వమివ కమలాన్యభ్యవర్ష న్ముఖాని.



భావం:



అనంతరం,

బ్రహ్మావర్తం అనే జనపదం ( దేశం ) మీదుగా,

క్షత్రియుల ( ధార్తరాష్ట్ర పాండవ ) యుద్ధానికి సూచకమైన,

కురుక్షేత్రాన్ని చేరు.

ఆ కురుక్షేత్రంలో అర్జునుడు,

వందలకొలది వాడివాజులతో ( పదునైన బాణాలతో )

జలధారలను పద్మాలపై నీవు, ఎలా వర్షిస్తావో

అలా రాజుల ముఖాలపై వర్షించాడు. ( కురిపించాడు.)




హిత్వా హాలామభిమతరసాం రేవతీలోచనాంకాం
బంధుప్రీత్యా సమరవిముఖో లాంగలీ యాః సిషేవే,
కృత్వా తాసామభిగమమపాం సౌమ్య సారస్వతీనా
మంతఃశుద్ధస్త్వమపి భవితా వర్ణమాత్రేణ కృష్ణః.



భావం :


బంధుప్రేమతో,

యుద్ధవిముఖుడైన బలరాముడు,

సురను ( మద్యం ) విడిచి,

సరస్వతీనదీజలాలను సేవించి, పరిశుద్ధుడయ్యాడు.

ఓ సౌమ్యుడా!

నీవూ, ఆ సరస్వతీనదీ ఉదకాలను సేవిస్తే,

నీ అంతరాత్మ పరిశుద్ధం అవుతుంది.

( అప్పుడు ) వర్ణంచేత మాత్రమే నల్లనివాడవు అవుతావు.



విశేషాలు:



పూర్వం, బలరాముడు, ఇరుపక్షాలూ బంధువులే కాబట్టి,

కురు పాండవ యుద్ధంలో ఎవరి పక్షాన చేరడానికీ ఇష్టపడక,

తీర్థయాత్రలకు వెళ్లిపోయాడు.

అప్పుడు తనకత్యంత ప్రియమైన సురను విడిచి,

(అసలు మద్యానికి హలిప్రియ అనే పేరు బలరామునివల్లే వచ్చింది.
హలి అంటే బలరాముడు. హలాన్ని (ఆయుధంగా) ధరించినవాడు = హలి
హలికి ఇష్టమైనది అనే అర్థంలో కల్లుకు హలిప్రియ అనే పేరు వచ్చింది.)

పరమపావనమైన సరస్వతీ జలాలను గ్రోలి, శుద్ధుడయ్యాడు.

ఈ కథను గుర్తుచేస్తున్నాడు.

ఓ మేఘుడా! ఆ ప్రాంతంలో సరస్వతీనది ఉంది. ఆ నదిని నీవు సేవిస్తే,

నీ శరీరవర్ణం అలాగే ఉన్నా, ఆ నదీజలప్రభావంతో నీ అంతరాత్మ పరిశుద్ధం అవుతుంది.

అంటున్నాడు.

శరీరపురంగును కాదు పట్టించుకోవలసింది.

ఉన్న నలుపు ఎంతమంది బ్యూటీషియన్స్ ను ఆశ్రయించినా,

ఎంత డబ్బు తగలేసినా పోదు.

కావలసినది , చేయవలసినది

నల్లగా ఉన్న మనసును తెల్లగా చేసుకోవడమే.

అదే అంతఃశుద్ధి.



మంగళం మహత్

8, మే 2011, ఆదివారం

మేఘసందేశం 48 , 49 శ్లోకాలు

త్వయ్యాదాతుం జలమవనతే శార్ఙ్గిణో వర్ణచౌరే
తస్యాః సింధో పృథుమపి తనుం దూరభావాత్ప్రవాహం,
ప్రేక్షిష్యంతే గగనగతయో నూనమావర్జ్య దృష్టీ
రేకం ముక్తాగుణమివ భువః స్థూలమధ్యేంద్రనీలం.


భావం:


శ్రీకృష్ణుని వర్ణాన్ని ( కాంతిని,రంగును ) దొంగిలించిన

( అంటే కృష్ణుని కాంతి వంటి కాంతి గల ) నీవు,

ఆ చర్మణ్వతి నదిఒద్దకు పోయి,

నీటిని తీసుకోవడానికి,

వంగి, ఉన్నపుడు,

పెద్దదైనా దూరంగా ఉండటంవల్ల చిన్నదిగా ఉన్న ఆ నదీ ప్రవాహాన్ని,

పైన ఆకాశంలో పోయేవారు చూసి,

ఆ నదిని భూమి ధరించిన ఒంటిపేట ముత్యాలహారంగాను,

నిన్ను, ఆ ముత్యాలహారం నడుమ ( మధ్య ) కూర్చిన

ఇంద్రనీలమణిగాను భావిస్తారు.



విశేషాలు :



- శ్రీకృష్ణుడు ఇంద్రనీలమణిలా ఉంటాడు.

మేఘుని కూడా అలా వర్ణించడానికి

కృష్ణునికి మేఘునికి ఒక్క శరీరవర్ణంలో తప్ప పోలికలు లేకపోవడంతో,

కవి, మొదటే మేఘుని " శార్ఙ్గిణో వర్ణచౌరే త్వయి " = శ్రీకృష్ణుని వర్ణాన్ని దొంగిలించిన నీవు,

అని వర్ణించి, ( ఏదో ఒకటి ) కృష్ణునినుండి గ్రహించినందువల్ల,

కృష్ణభావం కలిగినవాడయ్యాడు కాబట్టి, అప్పుడు కవి,

మేఘుని ఇంద్రనీలమణిలా ఉన్నావన్నాడు.


ఇక్కడో ఆధ్యాత్మిక రహస్యం ఉంది.

విష్ణువు ఇరవైఒక్క అవతారాల్లో పది అవతారాలు ముఖ్యమైనవి.

అందులోనూ రామకృష్ణావతారాలు ప్రజలమధ్య గడిపి,

ప్రజలతో మమేకమైన అవతారాలు.

వీరిద్దరూ ఆచరించి చూపించిన ధర్మప్రతిపాదితమైన ఏ ఒక్క అంశాన్నైనా, లేక

వారిలో ఏ ఒక్క వర్ణాన్నైనా ( వర్ణం అనే పదానికి గుణం అని కూడా అర్థం ఉంది.)

మనం గ్రహిస్తే, మనం దైవభావాన్ని పొందినట్లే.

అలా గ్రహించడం చెప్పినంత అనుకొన్నంత సులువు కాదు.

అలా గ్రహించే క్రియనే మనవాళ్లు తపస్సు అన్నారు.

భగవంతుడు అని అనకుండా రామకృష్ణులు అని

ఎందుకు అనడమంటే వారూ మానవులవలె జీవితం గడిపారు కాబట్టి.

ఇక్కడ రాముడంటే సాకేతరాముడు.



- ఏరియల్ వ్యూ లో, మనకు నది తెల్లగా కనిపిస్తుంది.

కవికి ముత్యాలహారంలా కనబడుతుంది.

కవి దర్శనానికి మన ( కవులుకానివారి ) చూపులకు అదే తేడా.



తాముత్తీర్య వ్రజ పరిచితభ్రూలతావిభ్రమాణాం
పక్ష్మోత్క్షేపాదుపరివిలసత్కృష్ణశారప్రభాణాం,
కుందక్షేపానుగమధుకరశ్రీముషామాత్మబింబం
పాత్రీకుర్వందశపురవధూనేత్రకౌతూహలానాం.



భావం:


ఆ చర్మణ్వతీనదిని దాటి, వెళ్తూంటే,

దశపురస్త్రీలు నిన్ను కుతూహలంతో చూస్తారు.

ఇలా నిన్ను చూడడం వారికి వేడుక అవుతుంది.

వారి తీగల్లాంటి కనుబొమల విలాసాల్ని,

కొంచెం ధవళకాంతితో కూడిన నల్లనికాంతులుగలవి కావడంతో

మొల్లపూలవెంట కదిలే తుమ్మెదలకాంతిని అపహరించినవైన ( పోలిన )

వారి కనుఱెప్పల్ని,

నయనకాంతుల్ని చూడడం నీకు వేడుక అవుతుంది.



మంగళం మహత్

7, మే 2011, శనివారం

మేఘసందేశం 47 వ శ్లోకం

ఆరాధ్యైనం శరవణభవం దేవముల్లంఘితాధ్వా
సిద్ధద్వంద్వై ర్జలకణభయాద్వీణిభిర్ముక్తమార్గః ,
వ్యాలంబేథాః సురభితనయాలంభజాం మానయిష్య౯
స్రోతోమూర్త్యా భువి పరిణతాం రంతిదేవస్య కీర్తిం.



భావం :



శరవనం ( ఱెల్లుగంట ) లో పుట్టిన

ఈ సుబ్రహ్మణ్యుని ఆరాధించి,(న తర్వాత)

వీణల్ని వాయిస్తున్న సిద్ధమిథునాలు ( మిథునం అంటే జంట )

వానచినుకులు తమ మీద పడతాయన్న భయంతో నీకు దారి ఇస్తారు కాబట్టి,

అక్కడినుండి బయలుదేరు. దారిలో ఒక నది కనిపిస్తుంది.

ఆ నది,

గోవులవధవల్ల పుట్టి,

భూమిమీద నదిలా మారిన రంతిదేవుని కీర్తి.

అటువంటి ఆయన కీర్తిని అనగా ఆ నదిని

సత్కరించడంకోసం వంగి, దిగు. ( లేక నిలు.)


విశేషాలు:


- శరం అంటే ఱెల్లు అని కూడా అర్థం. శరం అంటే బాణం అని తెలుసుగా. బాణాల్లా ఉన్న గడ్డే ఱెల్లు.

ఱెల్లుగడ్డి దుబ్బును శరవణం అంటారు. అందులో పుట్టిన వాడు శరవణభవుడు.

ఈయన కథ ముందు చెప్పుకొన్నాం.

శరవనం లో న మీద ణ ప్రత్యయం వస్తుంది.


- భగవంతునికి చేసే పూజలో ఎన్నో ఉపచారాలున్నాయి.

ఆయన సన్నిధిలో సంగీతం , నృత్యం మొదలైన లలితకలల ప్రదర్శన కూడా

ఉపచారమే.

అందుకే నిత్యోత్సవవైభవోపేతుడైన తిరుమల వేంకటపతికి నిత్యనాదనీరాజనం

సమర్పించబడుతోంది.

అలాగే సిద్ధమిథునాలు కుమారస్వామి ఎదుట వీణలు వాయించి,

ఆయనను ఆనందింపచేస్తున్నారు.

సిద్ధులు దేవజాతిలో ఒకరని చెప్పుకొన్నాం.


- "వాళ్లు దారి ఇవ్వరనుకొంటావేమో ?

వారికీ నీ చినుకులంటే భయమే.

శరాల్లాంటి నీ వనం అంటే భయం.

వనం అంటే నీరు అని కూడా అర్థం.

కాబట్టి శరవణభవుని కన్నా నీ శరవనం అంటే భయం." అని యక్షుని చమత్కారంగా భావించవచ్చు.



- ఇక నది కథ.

ఆ నది పేరే చర్మణ్వతీ నది. (ఇది, దశార్ణదేశంలో ఉంది. )

పూర్వం రంతిదేవుడనే మహారాజు యాగం చేయబోతూండగా,

సురభి సంతానమైన గోవులు ఆయన వద్దకు వచ్చి, మనుష్యభాషణాలతో,

తమను యాగంలో వ్రేల్చమని కోరాయి.

వాటిని వధించడానికి రంతిదేవుడు సంకోచిస్తూంటే,

తప్పు కాదని పుణ్యమే వస్తుందని ప్రోత్సహించాయి.

సరే. ఈ పనికి ఏ ఒక్క గోవు ఇష్టపడకపోయినా

యాగం మానేస్తానని రంతిదేవుడు అన్నాడు.

యాగంలో వధింపబడిన గోవులు గోలోకాన్ని చేరాయి.

ఆ గోవుల చర్మాలే ఒడ్లుగా వాటి రక్తం ప్రవహించి, నది అయ్యింది. (నదిగా మారింది.)

దానినే చర్మణ్వతీ నది అంటారు.

అంతటి మహాయాగం చేసినందుకు ఆ రంతిదేవుని కీర్తికి తార్కాణంగా,

ఈ నది ఉద్భవించింది.



మంగళం మహత్

6, మే 2011, శుక్రవారం

మేఘసందేశం 46 వ శ్లోకం

జ్యోతిర్లేఖావలయి గళితం యస్య బర్హం భవానీ
పుత్రప్రేమ్ణా కువలయదళప్రాపి కర్ణే కరోతి,
ధౌతాపాంగం హరశశిరుచా పావకేస్తం మయూరం
పశ్చాదద్రిగ్రహణగురుభి ర్గర్జితై ర్నర్తయేథాః .


భావం:



కాంతిపంక్తులమండలం కలది, ( జ్యోతిర్లేఖలచేత చుట్టుకొనబడినది )

తనంతట తాను జారింది ( బలవంతంగా వేరుచేసినది కాదు )

అయిన ఏ మయూరపింఛాన్ని, ( నెమిలిపింఛాన్ని )

భవాని ( పార్వతి ),

కుమారుని మీది ప్రేమతో,

కలువఱేకుకు బదులుగా చెవికొనయందు ధరిస్తున్నదో,

( అసలే తెల్లనివైన ) ఏ మయూరనేత్రాలు,

శివుడు ధరించిన చంద్రునికాంతితో ( మఱింత ) శుభ్రమైనవో,

ఆ నెమిలిని,

( పుష్పవర్షం కురిసిన ) తర్వాత

అద్రిగ్రహణంతో గొప్పవైన ( కొండల్ని పట్టుకోవడంచేత గొప్పవైన )
అంటే కొండగుహల్లో ప్రతిధ్వనించడంచేత గొప్పవైన )

ఉఱుములతో ఆడించు.



తాత్పర్యం :



కుమారస్వామి మయూరవాహనుడు కదా!

ఆయన నెమెలిని ఆనందింపజేసి, తద్ద్వారా స్వామి అనుగ్రహం పొందమని

మేఘునితో యక్షుడు అంటున్నాడు.

తన కుమారుని వాహనమైన నెమిలిపింఛాన్నే , పార్వతి కర్ణాభరణంగా ధరిస్తుంది.

కుమారసంభవాద్పూర్వం భవాని, కలువదళాన్ని ధరించేది.

ఇప్పుడు తన ప్రియపుత్రునిమీద తనకు గల ప్రేమను సూచించడానికి,

బర్హిపింఛాన్ని ధరిస్తోంది. జగన్మాత అనుగ్రహం ఆ విధంగా పొందిన నెమిలి అది.

ఆ పింఛం కాంతులవరుసలతో చుట్టుకొనబడింది + తనంతట తానే జారినది

( పురి నుండి తనంతట తాను వెలువడిన నెమిలిపింఛాన్ని గ్రహించాలి కాని

మనం నెమిలినుండి బలవంతంగా తీసుకోకూడదు. )

అని పింఛాన్ని, వర్ణించాడు.

తెల్లనైన కేకినేత్రాలు హరుడు ధరించిన శశికాంతితో ఇంకా శుభ్రం అయ్యాయని,

నెమెలికండ్లను వర్ణించాడు.

శివానుగ్రహం కూడా కల నెమిలి.

ఇక మేఘుని ఉఱుములు కొండగుహల్లో ప్రతిధ్వనించాకే వాటి గొప్పతనం తెలుస్తుంది.

ఆ ఉఱుములకు నెమిళ్లు ఆనందించి, నాట్యం మొదలుపెడతాయి.

అదే చేయించమంటున్నాడు. ఉఱుములతో ఆడించమంటున్నాడు.

తన వాహనాన్ని ఆనందింపజేస్తే, కుమారుడు అనుగ్రహిస్తాడు కదా!



మంగళం మహత్

5, మే 2011, గురువారం

మేఘసందేశం 45 వ శ్లోకం

తత్ర స్కందం నియతవసతిం పుష్పమేఘీకృతాత్మా
పుష్పాసారైః స్నపయతు భవా న్వ్యోమగంగాజలార్ద్రైః,
రక్షాహేతో ర్నవశశిభృతా వాసవీనాం చమూనా
మత్యాదిత్యం హుతవహముఖే సంభృతం తద్ధి తేజః



క్షమించండి. మధ్యలో అడ్డు వచ్చినందుకు.
తెలుసు కదా! శ్లోకం మొదట ప్రకాశంగా అంటే బయటకు చదవండి.
ఎన్నిసార్లు? భయపడకండి. తప్పులు రాకుండా చదువగలిగేవరకు.
ఎందుకు? భావం బాగా అర్థమవుతుంది.
ఇంకా? సంస్కృతం అందం తెలుస్తుంది.
తెలుగువారికి సంస్కృతం ఎందుకంటారా ?
అన్నన్నా. అలా అనకండి.
ఇంగ్లీషు కంటే భారతీయభాష , దేవభాష, వేదభాష అయిన
సంస్కృతం తీసిపోయిందంటారా ?
పరాయి భాషలపై ఉన్న మోజులో కొంత శాతం
సంస్కృతంకోసం కేటాయించండి.
దాని కోసమే శ్లోకం. అయితే ఈ శ్లోకాలతోనే సంస్కృతం రాదు.
అభిరుచి కలుగవచ్చు కదా!
అలా అని ఇప్పటికే రకరకాలుగా పలుచన అయిపోయిన మన
మాతృభాషను నిర్లక్ష్యం చేయకండి.
దాని కోసమే భావం.
ఇక చిత్తగించండి.


భావం:



ఓ మేఘుడా!

దేవగిరిని చేరబోతున్నావు కదా!

అది కుమారస్వామి నిత్యనివాసస్థానం.

ఆ కుమారస్వామిని,

నీవు,

పుష్పమేఘుడవై ( పూలను వర్షించే మేఘంగా చేయబడిన దేహం కలవాడవై )

ఆకాశగంగాజలాలతో తడిసిన పుష్పాల ధారావర్షంచేత

అభిషేకం చెయ్యి.

ఆ కుమారస్వామి,

ఇంద్రుని సైన్యాన్ని రక్షించడంకోసం

నవశశిభృతుడు ( బాలచంద్రశేఖరుడు ) ( శివుడు ),

అగ్నిముఖమందు ఉంచిన

సూర్యుని అతిక్రమించిన తేజస్సుకదా!



విశేషాలు:



తారకాసురుడు అనే ఒక రాక్షసుని సంహరించడంకోసం,

బ్రహ్మాదిదేవతలు ప్రార్థించిన మీదట శివుడు, బ్రహ్మచర్యాన్ని వీడి,

పార్వతిని పరిణయమాడి, కొన్ని కారణాంతరాలచేత,

తన తేజోవంతమైన వీర్యాన్ని, జగన్మాతయందు కాక,

అగ్నియందు ఉంచాడు.

అంతటి అగ్ని కూడా ఆ తేజస్సును భరించలేక,

గంగయందు ఉంచాడు.

గంగ కూడా భరించలేక రెల్లుగడ్డిమీదకు తోయగా తోయజాక్షుడైన

కుమారుడు జన్మించాడు.

కృత్తికలచేత పెంచబడిన ఆ కార్తికేయుడు,

పార్వతి ప్రసాదంతో వేలాయుధుడై,

తారకాసురుని సంహరించాడు.

ఆ తరువాత దేవతల ప్రార్థనచే

పైన పేర్కొన్న దేవగిరిమీద నిత్యనివాసానికి అంగీకరించాడు.

అంటే సతతం, సదా, ఎల్లప్పుడు, ఆ దేవగిరిమీద కొలువై ఉంటాడు.



- కుమారస్వామి వృత్తాంతాన్ని కాళిదాసు "కుమారసంభవం" అనే

మహాకావ్యంగా రచించాడు.



- " దేవతల రక్షణ కోసం ఉద్భవించిన కుమారుని

నీవు పూజిస్తే సకలదేవతలు ఇంద్రునితో సహా నీకు అనుకూలురే అవుతారు.

అది నీకు రక్షణ హేతువు." అని మేఘునికి యక్షుడు సూచించినట్లు భావించవచ్చు.



- వర్షమేఘాన్ని పుష్పమేఘం అవ్వమంటున్నాడు. ఎంత అందమైన భావనో చూశారా!




మంగళం మహత్



ప్రతి భారతీయుడు, తన మాతృభాషను, సంస్కృతాన్ని
రెండు కళ్లుగా భావించాలి. అప్పుడు జ్ఞానం + విజ్ఞానం లభిస్తాయి.

4, మే 2011, బుధవారం

మేఘసందేశం 44 వ శ్లోకం

త్వ న్నిష్యందోచ్ఛ్వసిత వసుధా గంధసంపర్క రమ్యః
స్రోతోరంధ్రధ్వనితసుభగం దంతిభిః పీయమానః,
నీచై ర్వాస్య త్యుపజిగమిషో ర్దేవపూర్వం గిరిం తే
శీతో వాతః పరిణమయితా కాననోదుంబరాణాం.



భావం:



నీ వర్షంతో భూమి ఊరట

చెందుతుంది.

సువాసనలు వెదజల్లుతుంది.

గాలి ఆ పరిమళాన్ని ధరిస్తుంది.

ఏనుగులు ఆ సువాసనలను ఆఘ్రాణిస్తూంటాయి.

అప్పుడు వాని తొండాలనుండి

వినుటకు ఇంపైన ధ్వని వెలువడుతుంది.

అడవి మేడికాయలు పండి, ( అత్తిపండ్లు )

ఆ వాసనలు వస్తూంటాయి.

వీటన్నిటితో కూడిన చల్లని గాలి,

దేవగిరిని చేరబోతున్న నీకు అనుకూలంగా మెల్లగా వీయగలదు.


ఉన్నదున్నట్లుగా అంటే ఇలా చెప్పాలి.


నీ వర్షంచేత తడిసిన భూమి వెదజల్లిన సువాసనను ధరించినది,


ఏనుగులచేత ఆఘ్రాణింపబడి, ధ్వనులు చేయించేది,

మేడికాయలను పండించేది,

అయిన చల్లని గాలి,

దేవగిరిని చేరబోతున్న నీకు మెల్లగా వీయగలదు.


మంగళం మహత్

3, మే 2011, మంగళవారం

మేఘసందేశం 41 , 42 , 43 శ్లోకాలు

తస్మిన్కాలే నయనసలిలం యోషితాం ఖండితానాం
శాంతిం నేయం ప్రణయిభిరతో వర్త్మ భానోస్త్యజాశు,
ప్రాలేయాస్రం కమలవదనాత్సో౭పి హర్తుం నలిన్యాః
ప్రత్యావృత్తస్త్వయి కరరుధి స్యాదనల్పాభ్యసూయః.



భావం:



ఆ సూర్యోదయసమయం

( కొందఱు ) భర్తలు తమ సతుల కన్నీళ్లు తుడిచే సమయం.

( సతులెందుకు ఏడుస్తారంటే, మఱి రాత్రంతా తిరిగి తెల్లవారాక వస్తే ఏడవరా ? )
రాత్రంతా ఎక్కడ తిరిగారో తెలివైన మీకు తెలుపక్కరలేదు కదా!
అటువంటి సతులను ఖండితలు అంటారు. )

అలాగే సూర్యుడు ఉదయాన రాగానే,

ఖండిత లాంటి పద్మిని ( తామరపువ్వు )

మంచు అనే కన్నీటిని నింపుకొంటే,

ఆ కన్నీటిని తుడువడానికి సూర్యుడు,

కిరణాలు అనే కరాల్ని ( చేతుల్ని ) చాపుతూంటాడు.

అప్పుడు నీవు అడ్డం పోకు.

కోపం వస్తుంది.

అది నీకు మంచిది కాదు.







గంభీరాయాః పయసి సరిత శ్చేతసీవ ప్రసన్నే
ఛాయాత్మాపి ప్రకృతిసుభగో లప్స్యతే తే ప్రవేశం,
తస్మా దస్యాః కుముదవిశదా న్యర్హసి త్వం న ధైర్యా
న్మోఘీకర్తుం చటులశఫరోద్వర్తనప్రేక్షితాని.



భావం:



తర్వాత మనస్సులా నిర్మలమైన

గంభీర అనే నది కనబడుతుంది.

నీవు ఆ నదిని ఇష్టపడకపోయినా,

ఆ నది నీటిలో నీ ఛాయాశరీరమైనా ఉంది కాబట్టి,

ఆ నది నిన్ను మనసులో తలుస్తూనే ఉంటుంది.

అలా ఇష్టపడి, చేపల పొర్లిగింతలనే చూపులతో నిన్ను చూస్తుంది.

ఆ చూపులను నీ ధూర్తత్వంతో వ్యర్థం చేయకు.







తస్యాః కించి త్కరధృతమివ ప్రాప్తవానీరశాఖం
హృత్వా నీలం సలిలవసనం ముక్తరోధోనితంబం,
ప్రస్థానం తే కథమపి సఖే లంబమానస్య భావి
జ్ఞాతాస్వాదో వివృతజఘనాం కో విహాతుం సమర్థః.




భావం:



నీవు ఆ గంభీరానదీజలాలను గ్రోలితే,

నీకు మధురమైన అనుభవం కలుగుతుంది.

వెళ్లడానికి నీకు మనసు రాదు.






మంగళం మహత్

2, మే 2011, సోమవారం

మేఘసందేశం 40 వ శ్లోకం

తాం కస్యాంచిద్భవనవలభౌ సుప్తపారావతాయాం
నీత్వా రాత్రిం చిరవిలసనాత్ ఖిన్నవిద్యుత్కళత్రః,
సూర్యే దృష్టే పునరపి భవాన్వాహయేదధ్వశేషం
మందాయంతే న ఖలు సుహృదామభ్యుపేతార్థకృత్యాః.



భావం:



నీ భార్య అయిన సౌదామని ( మెఱపు )

మెఱసి మెఱసి అలసి సొలసి ఉంటుంది.

అంత ఆమెతో కూడి, నీవు,

పావురాలు నిద్రిస్తున్న ఏదైనా ఒక భవనంమీద ఆ రాత్రి గడపి,

మరల తెల్లవారగానే,

ప్రయాణం చెయ్యి.

మిత్రులకు ఉపకారం చేయడానికి,

అంగీకరించి, అందుకు పూనుకొన్న నీలాంటివారు,

ఆలస్యం చేయరు కదా!



మంగళం మహత్

1, మే 2011, ఆదివారం

మేఘసందేశం 39 వ శ్లోకం

గచ్ఛంతీనాం రమణవసతిం యోషితాం తత్ర నక్తం
రుద్ధాలోకే నరపతిపథే సూచిభేద్యైస్తమోభిః,
సౌదామిన్యా కనకనికషస్నిగ్ధయా దర్శయోర్వీం
తోయోత్సర్గ స్తనితముఖరో మాస్మభూర్విక్లబా స్తాః.



భావం:


( మహాకాళేశ్వరుని సేవ పూర్తి అయిన తర్వాత తిరిగి నగరసంచారం.)



ఆ ఉజ్జయినిలో కటికచీకట్లో

రమణుల ఇంటికి పోతున్న స్త్రీలకు, ( అభిసారికలకు )

నీ మెఱపులతో దారి చూపు.

ఉఱమవద్దు.

వర్షింపనూ వద్దు.

ఉఱిమినా వర్షించినా

పాపం ఆ యువతులు భయపడతారు.


మంగళం మహత్

Sundarakanda సుందరకాండ 35

                                     రామసుందరం పఞ్చత్రింశస్సర్గః తాం తు రామకథాం శ్రుత్వా వైదేహీ వానరర్షభాత్‌ । ఉవాచ వచనం సాంత్వ మిద...