30, ఏప్రిల్ 2011, శనివారం

మేఘసందేశం 38 వ శ్లోకం

పశ్చాదుచ్చైర్భుజతరువనం మండలేనాభిలీనః
సాంధ్యం తేజః ప్రతినవజపాపుష్పరక్తం దధానః,
నృత్యారంభే హర పశుపతేరార్ద్రనాగాజినేచ్ఛాం
శాంతోద్వేగస్తిమితనయనం దృష్టభక్తిర్భవాన్యా.


భావం:



సాయంకాలపూజ తర్వాత

శివుడు, నృత్యానికి పూనుకొన్నప్పుడు ( శివుని నృత్యాన్ని తాండవం అంటారు.)

ఎత్తిన ఆయన చేతులమీద,

క్రొత్తదాసానిపువ్వులా ఎఱ్ఱనైన సంధ్యాకాంతి గల నీవు, వ్రాలి

రక్తంచేత తడిసిన గజచర్మంమీద

ఆయనకు గల కోరికను పోగొట్టు.

అప్పుడు అమ్మవారి నయనాలు

భయంపోయి, స్తిమితపడతాయి.

( నీవల్ల ఆవిడకు గజచర్మభయం పోతుంది. కాన )

అప్పుడు నిన్ను వేడుకగా చూస్తారు.

ఇలా వారి అనుగ్రహానికి పాత్రుడవు కావచ్చు.



మంగళం మహత్

29, ఏప్రిల్ 2011, శుక్రవారం

మేఘసందేశం 37 వ శ్లోకం

పాదన్యాసక్వణితరశనాస్తత్ర లీలావధూతై:
రత్నచ్ఛాయాఖచితవలిభిశ్చామరైః క్లాంతహస్తాః,
వేశ్యా స్త్వత్తో నఖపదసుఖాన్ప్రాప్య వర్షాగ్రబిందూ
నామోక్ష్యంతే త్వయి మధుకరశ్రేణిదీర్ఘాన్కటాక్షాన్.



భావం:



ఆ సంధ్యాపూజలో

పణ్యస్త్రీలు, నాట్యం చేస్తూ,

చామరాలతో మహాకాళేశ్వరస్వామికి వీచుతూంటారు.

నీవు వారిమీద పడేటట్లు

చల్లగా నీటిబిందువుల్ని వర్షిస్తే,

నిన్ను, తుమ్మెదబారుల్లాంటి కడగంటిచూపులతో చూస్తారు.

వారి చూపులు నీకు ఆనందాన్ని కలిగిస్తాయి.



మంగళం మహత్

28, ఏప్రిల్ 2011, గురువారం

మేఘసందేశం 36 వ శ్లోకం

అప్యన్యస్మింజలధర మహాకాళమాసాద్య కాలే
స్థాతవ్యం తే నయనవిషయం యావదత్యేతి భానుః,
కుర్వన్సంధ్యాబలిపటహతాం శూలినః శ్లాఘనీయా
మామంద్రాణాం ఫలమవికలం లప్స్యసే గర్జితానాం.



భావం:



ఓ మేఘుడా!

నీవు, ఆ మహాకాళక్షేత్రంలో

సాయంకాలం వరకు ఉండు.

ఆ సాయంసంధ్యాకాలంలో కొనియాడతగిన*

ఈశ్వరునికి చేసే పూజలో / ఈశ్వరుని పూజ జరుగుతూండగా,

( శివునికి సాయంసంధ్యాకాలం పరమప్రీతికరం. )

నీవు కొంచెం కొంచెంగా ఉఱిమితే,

పటహములు ( తప్పెటలు ) వాయించినట్లుంటుంది.

నీకు కొంచెం గంభీరాలైన ఉఱుములు ఉన్నందుకు,

భగవత్సన్నిధిలో ఉపయోగించడంవల్ల ,

ప్రయోజనం కలుగుతుంది.


విశేషాలు:



భగవంతుడు, అపారకరుణతో మనకు దేహంతోపాటు అనేక శక్తులుఇచ్చాడు.

ఇది మనం గుర్తించి, ఈ దేహాన్ని, ఆ శక్తులను
భగవత్సేవకు, భాగవతసేవకు, మరియు
(శరీరావయవలోపంచేత సహాయం కోరేవారు,
ధనజనలేమిచేత నిస్సహాయులైన వారు, ఈ రెండురకాల)

దీనజనసేవకు ఉపయోగిస్తే, పరమశ్రేయోలాభం కలుగుతుంది.

అంటే భగవంతునికి మనమంటే ఇష్టం కలుగుతుంది.

ఈ జన్మకు సాఫల్యం - ఈశ్వరుడు మనల్ని ఇష్టపడటమే.



* "కొనియాడతగిన" అనే ఈ విశేషణం ఈశ్వరునికీ అన్వయించుకోవచ్చు.
పూజకును అన్వయించుకోవచ్చు.




మంగళం మహత్

27, ఏప్రిల్ 2011, బుధవారం

మేఘసందేశం 35 వ శ్లోకం

భర్తుః కంఠచ్ఛవిరితి గణైః సాదరం వీక్ష్యమాణః
పుణ్యం యాయా స్త్రిభువనగురోర్ధామ చండీశ్వరస్య,
ధూతోద్యానం కువలయరజోగంధిభిర్గంధవత్యా
స్తోయ క్రీడానిరతయువతిస్నానతిక్తైర్మరుద్భిః.



భావం:



నీకు అలౌకికానందం, లౌకికానందం ఒకేసారి కలుగుతాయి.

( తమ ) స్వామి యొక్క

కంఠం కాంతి వంటి కాంతి గలవాడవనే కారణంచేత

( అనగా శివునికంఠంలా నల్లగా ఉంటావు కనుక )

ప్రమథగణాలు (నిన్ను) ఆదరణతో చూస్తారు.

వారి ఆదరణ పొందినవాడవై,

త్రిభువనగురుడు,

చండికాపతి అయిన శివునియొక్క

పవిత్రధామాన్ని పొందు.

ఈ క్షేత్రప్రవేశంతో అలౌకికానందం.

( ఉజ్జయిని మహాపుణ్యక్షేత్రం. ఈశ్వరుడు, మహాకాలుడనే పేరుతో
కొలువై ఉన్నాడక్కడ. ద్వాదశజ్యోతిర్లింగాలలో ఉజ్జయిని ఒకటి.)

( పుణ్యక్షేత్రమే కాదు భోగక్షేత్రం కూడా అంటున్నాడు. ఎలా అంటే )

అక్కడ గంధవతి అనే నది ఉంది.

దాని నిండా పరిమళాలు వెదజల్లే కలువపూలు ఉన్నాయి.

ఆ గంధవతీనది మీదినుంచి,

ఈ కలువపూల పరిమళాన్ని,

అందులో స్నానం చేసే యువతుల

స్నాన ( చందనం మొదలైన ) వస్తువుల పరిమళాన్ని మోసుకొని వస్తూ,

వీచే గాలులు, ఉద్యానవనాల్ని కదిలిస్తూంటాయి.

అలా ఉద్యానపుష్పపరిమళాలు కూడా

గంధవతీ నదీ వాయువులు మోసుకొచ్చే పరిమళాలతో కలుస్తాయి.

ఈ మూడువిధాలైన గంధాలతో చల్లగాలి మెల్లగా వీస్తూంటుంది.

కాబట్టి చాల సుఖం కలుగుతుంది.

ఇది లౌకికానందం.

ఈ రెండు రకాల ఆనందాలతో నీకు విశేషలాభం కలుగుతుంది.



మంగళం మహత్

26, ఏప్రిల్ 2011, మంగళవారం

మేఘసందేశం 34 వ శ్లోకం

జాలోద్గీర్ణై రుపచితవపుః కేశసంస్కారధూపై
ర్బంధుప్రీత్యా భవనశిఖిభిర్దత్తనృత్యోపహారః
హర్మ్యేష్వస్యాః కుసుమసురభిష్వధ్వఖేదం నయేథాః
పశ్య౯ లక్ష్మీం లలితవనితాపాదరాగాంకితేషు.



భావం:



ఉజ్జయినీ స్త్రీలు,

తమ కేశాలు సువాసనలను వెదజల్లడానికై

చేసుకొన్న, వేసుకొన్న ధూపాలు,

గవాక్షాల (windows) నుండి వెలువడి,

నీలో కలుస్తాయి.

అపుడు నీ దేహానికి వృద్ధి, (పుష్టి) కలుగుతుంది.

( ధూమం మేఘమవుతుందని, ఇంతకుముందు చెప్పబడింది కదా! )

అది నీకొక ఆతిథ్యం.

ఇంకా,

(తమ) బంధువనే ప్రేమచేత,

అక్కడి పెంపుడునెమళ్లు,

నీ ఎదుట నాట్యం చేసి, నీకు ఆనందం కలిగిస్తాయి.

( చంద్రదర్శనంతోనే సముద్రుడుప్పొంగినట్లు,
సూర్యసమీక్షణంతోనే కమలాలు వికసించినట్లు,
మేఘసందర్శనంతోనే నెమళ్లు పురివిప్పుతాయి, ఆడతాయి.
కాన మేఘుడు బంధువు.)

పూలచేత పరిమళిస్తున్నవై,

అందమైన ఆడువారి పాదాల లత్తుక గుర్తులున్న మేడలపై కూర్చుని,

ఉజ్జయినీలక్ష్మిని ( సంపదను , సౌభాగ్యాన్ని )

చూస్తూ, మార్గాయాసాన్ని పోగొట్టుకో.



మంగళం మహత్

25, ఏప్రిల్ 2011, సోమవారం

మేఘసందేశం 33 వ శ్లోకం

హారాంస్తారాం స్తరళగుటికా న్కోటిశః శంఖశుక్తీః
ఘాసశ్యామాన్మరకతమణీనున్మయూఖప్రరోహా౯,
దృష్ట్వా యస్యాం విపణిరచితాన్విద్రుమాణాం చ భంగా౯
సంలక్ష్యంతే సలిలనిధయ స్తోయమాత్రావశేషాః.



భావం:



ఆ విశాలాపట్టణంలోని అంగడివీథుల్లో,

కోట్లకొలది శుద్ధములైన నాయకరత్నాలను,

ముత్యాలహారాలను,

శంఖాలను,

ముత్యపుచిప్పలను,

పచ్చికలా ఆకుపచ్చవర్ణం కల్గిన మరకతమణులను,

పగడపుఖండాలను, చూచి, ప్రజలు,

"సముద్రాలలో ఇక నీరుమాత్రమే మిగిలింది.

రత్నాలు లేవు.

ఎందుకంటే అన్ని సముద్రాల్లోని రత్నాలు

ఇక్కడ చేరాయి కదా!." ~ అని భావిస్తారు.

విశాలాపట్టణం రత్నసంపదకు ఆలవాలం అని భావం.



మంగళం మహత్




ప్రేమావతారుడైన భగవాన్ శ్రీసత్యసాయిబాబావారి
దివ్యచరణారవిందాలకు సజల నయనాలతో నమస్సులు.



మంగళం మహత్

24, ఏప్రిల్ 2011, ఆదివారం

మేఘసందేశం 32 వ శ్లోకం

దీర్ఘీ కుర్వ౯ పటు మదకలం కూజితం సారసానాం
ప్రత్యూషేషు స్ఫుటితకమలామోదమైత్రీకషాయః,
యత్ర స్త్రీణాం హరతి సురతగ్లానిమంగానుకూలః
శిప్రావాతః ప్రియతమ ఇవ ప్రార్థనాచాటుకారః.


భావం:



ఆ విశాలాపట్టణం దగ్గరలో శిప్రానది ఉంది.

ఆ శిప్రానది గాలి,

అంటే ఆ నదిమీదినుండి వీచే ( చల్లని ) గాలి,

బెగ్గురుపక్షుల చక్కని కూజితాలను, దీర్ఘం చేసేది.

అంటే వాటి ధ్వనులను ఎడతెగకుండా చేసేది.

వికసించిన ( శిప్రానదిలోని ) పద్మాల పరిమళంతో కూడినది.

ఇంకా ఆ శిప్రానది గాలి తిన్నగా వీచి, శరీరానికి సుఖంగా సోకేది.

ఈ విధంగా శైత్యం, ( శీతలం )

సౌరభం, ( పరిమళం )

మాంద్యం ( నెమ్మది )

మొదలైన గుణాలతో కూడిన సామర్థ్యంతో

శిప్రానది గాలి,

స్త్రీల రతిశ్రమను పోగొడుతుంది.

తిరిగి అభిలాషను పుట్టిస్తుంది.




అని, శిప్రానది గాలిని యక్షుడు మేఘునికి వర్ణించిచెప్పాడు.



మంగళం మహత్

23, ఏప్రిల్ 2011, శనివారం

మేఘసందేశం 31 వ శ్లోకం

ప్రాప్యావంతీనుదయనకథాకోవిదగ్రామవృద్ధా౯
పూర్వోద్దిష్టా మనుసర పురీం శ్రీవిశాలాం విశాలాం,
స్వల్పీభూతే సుచరితఫలే స్వర్గిణాం గాం గతానాం
శేషైః పుణ్యై ర్హృతమివ దివః కాంతిమత్ఖండమేకం.




భావం:



అవంతి, ప్రసిద్ధమైన దేశం.

ఆ దేశంలోని గ్రామాల్లో ఉండే పెద్దవారు,

ఉదయనమహారాజు కథలను బాగా తెలిసినవారు.

ఆ దేశంలోనే ముందు నేను చెప్పిన విశాలాపట్టణం ఉంది.

( దీన్నే ఉజ్జయిని అంటారు. ఇది అవంతికి రాజధాని.)

సంపన్నమైన నగరం.

ఇంకా ఆ నగరం ఎలా ఉంటుందంటే,

కొంచెం పుణ్యం ఉండగానే,

స్వర్గసుఖం అనుభవిస్తున్నవారు,

భూమిమీద జన్మిస్తే,

ఆ మిగిలిన పుణ్యఫలాన్ని అనుభవించడానికి

తెచ్చిన స్వర్గఖండమో అన్నట్లు ఉంటుంది.

అంటే స్వర్గతుల్యంగా ఉంటుంది. స్వర్గసుఖాలన్నీ ఇక్కడ ఉంటాయి. అని భావం.

ఓ మేఘుడా! అటువంటి ఉజ్జయినిని పొందు.



మంగళం మహత్

22, ఏప్రిల్ 2011, శుక్రవారం

మేఘసందేశం 30 వ శ్లోకం

వేణీభూతప్రతనుసలిలా సా త్వతీతస్య సింధుః
పాండుచ్ఛాయా తటరుహతరుభ్రంశిభిర్జీర్ణపర్ణైః
సౌభాగ్యం తే సుభగ విరహావస్థయా వ్యంజయంతీ
కార్శ్యం యేన త్యజతి విధినా స త్వయైవోపపాద్యః


భావం:


సుందరుడా!

అందగాడవైన నిన్ను, ఎడబాయడంతో,

ఆ నిర్వింధ్యానది,

సన్నని జాలుగా ప్రవహిస్తున్న

జలమనే జడ వేసుకొని,

ఒడ్డులందు మొలచిన చెట్లనుండి

జాఱిపడిన ఎండుటాకులతో,

తెల్లబాఱినదై ఉండి,

ఇలాంటి విరహావస్థచేత,

చూసేవారికి, ( ఈ నిర్వింధ్య ప్రియుడెంతో అందగాడు కాబట్టే అతని విరహంతో
ఈమె ఇంతలా చిక్కిపోయింది అనుకొనేట్లు )

నీ సౌందర్యాన్ని ప్రకటిస్తున్న,

ఆ నిర్వింధ్యకు,

సంతోషం కలిగించు.




మంగళం మహత్

21, ఏప్రిల్ 2011, గురువారం

మేఘసందేశం 29 వ శ్లోకం

వీచిక్షోభస్తనితవిహగశ్రేణికాంచీగుణాయాః
సంసర్పంత్యాః స్ఖలితసుభగం దర్శితావర్తనాభేః,
నిర్వింధ్యాయాః పథి భవ రసాభ్యంతరః సన్నిపత్య
స్త్రీణామాద్యం ప్రణయవచనం విభ్రమో హి ప్రియేషు.




భావం:



నీవు ఉజ్జయినీ పట్టణానికి పోతున్నప్పుడు,

మార్గమధ్యంలో,

"నిర్వింధ్య " అనే నదిని కలుసుకోగలవు.

( ఈ నది, వింధ్య పర్వతానికి ఉత్తరంగా ప్రవహించే నది. )

ఆ నది అలల కదలికలకు,

( హంసాది ) పక్షులు, ధ్వనులు చేస్తూంటాయి.

ఆ పక్షుల పంక్తులు కనులకింపుగా ఉంటాయి.

ఆ నది తొట్రుపాటు పడుతూ,

సుందరంగా ప్రవహిస్తూ పోతూంటుంది.

సుడులు తిరుగుతూ ఉంటుంది.

ఆ నదిని కలిసి, ( ఆ నదీజలాలను తీసుకొని, )

రసాంతరంగుడివి కా. ( రసాంతరంగుడు = జలము లోపల కలవాడు. )





విశేషాలు:



పై భావం శ్లోకంలోని మూడు పాదాలకు.

దీనిలో ఒక అంతరార్థం ఉంది.

అది వివరించాక, నాలుగవ పాదభావం తెలుసుకొందాం.




నిర్వింధ్యను స్త్రీతో పోలిస్తే,

పైన పేర్కొన్న పక్షుల వరుసలు ఆమె మొలనూలు.

సుడి ఆమె నాభి.

తొట్రుపాటు ప్రవాహం , స్త్రీ సహజసుందరగమనం.

ఆమె నుండి మేఘుడు గ్రహించే రసం శృంగార రసం.

రసం అనే పదానికి ఉన్న అనేక అర్థాల్లో

జలం అనే అర్థాన్ని,

శృంగారరసార్థాన్ని,

కాళిదాసు ఇలా అందంగా ఉపయోగించుకొన్నాడు.



ఇక నాల్గవపాదానికి భావం:



స్త్రీలకు ప్రియులయందు, విలాసమే మొదటి ప్రణయవచనం అవుతోంది.

అంటే,

ఆడువారు, తమ విలాసాలచేతనే,

తమ మనోభిప్రాయాలను ప్రియులకు తెలుపుతారు.

గ్రహించినవాడు శ్రీనాథుడవుతాడు. - శృంగారి.

గ్రహించనివాడు వేమన అవుతాడు. - విరాగి.



మంగళం మహత్

20, ఏప్రిల్ 2011, బుధవారం

మేఘసందేశం 28 వ శ్లోకం

వక్రః పంథా యదపి భవతః ప్రస్థితస్యోత్తరాశాం
సౌధోత్సంగప్రణయవిముఖో మాస్మభూరుజ్జయిన్యాః,
విద్యుద్దామస్ఫురితచకితైర్యత్ర పౌరాంగనానాం
లోలాపాంగైర్యది న రమసే లోచనై ర్వంచితః స్యాః.



భావం:



ఉత్తరదిక్కుగా పోతున్న నీకు,

ఉజ్జయినీ మార్గం వంకరైనదైనా,

ఉజ్జయినీ మేడల పైభాగాలను చూడడానికి,

విముఖుడవు ( ఇష్టం లేనివాడవు ) కావద్దు.

( ఎందుకంటే )

అక్కడి స్త్రీలు నీ మెఱుపులను చూచి, భయపడతారు.

అప్పుడు వారి బెదరుచూపులు చాల అందంగా ఉంటాయి.

ఆ సౌందర్యాన్ని చూడకపోతే,

మోసపోయినవాడవవుతావు.

నీ జన్మ నిష్ప్రయోజనం.




మంగళం మహత్

19, ఏప్రిల్ 2011, మంగళవారం

మేఘసందేశం 27 వ శ్లోకం

విశ్రాంతః సన్వ్రజ వననదీతీరజాతాని సించ
న్నుద్యానానాం నవజలకణై ర్యూథికాజాలకాని,
గండస్వేదాపనయనరుజాక్లాంతకర్ణోత్పలానాం
ఛాయాదానాత్క్షణపరిచితః పుష్పలావీముఖానాం.



భావం:




నీవు,

ఆ నీచైర్గిరియందు శ్రమదీర్చుకొంటూ,

వననదీతీర ఉద్యానవనాల్లో,

( అక్కడి అడవులందలి నదుల ఒడ్డుల్లో ఉన్న తోటల్లో ),

పూచిన మొల్లమొగ్గలను,

క్రొత్త నీటిచుక్కలచేత తడుపు.

చెక్కిళ్ల మీద చెమటను,

పోగొట్టి, ఆ బాధతో వాడిన నల్లకలువలు చెవికొనల్లో గల,

పువ్వులు కోస్తున్న స్త్రీల ముఖాలకు,

ఛాయను ఇచ్చి,

కాసేపు పరిచయం గలవాడవై,

పొమ్ము.

అంటే,

అక్కడ పువ్వులు కోస్తున్న స్త్రీలు ఉంటారు.

వారికి ఎండచేత చెమట పట్టకుండా ఛాయను దానం చేయి.

ఇక్కడ ఛాయ అంటే "నీడ" అని "కాంతి" అని రెండు అర్థాలు చెప్పవచ్చు.

నీడను ఇస్తే సంతోషిస్తారు.

మరి కాంతి?

వారి ముఖాలు సహజకాంతివంతాలు.

సూర్యకాంతివల్ల వారి ముఖాల్లోని కాంతి అదృశ్యమైంది.

ఇపుడు మేఘుని నీడ వల్ల సూర్యకాంతి పడకపోవడంతో,

వారి ముఖకాంతి మరల వారి ముఖాలను చేరుతుంది.

అది వారికీ నీకూ సంతోషం కలిగిస్తుంది.

ఆ ఉపకారంచేత వారికీ నీకూ పరిచయం కూడా కలుగుతుంది.

ఇది నీకు ఇంకా సంతోషం కలిగిస్తుంది.

నిజమే కదా!

మగవారికి స్త్రీల పరిచయాన్నిమించిన ఆనందం ఏముంది?

కాని, దురుద్దేశంతో చేసుకొనే పరిచయాలు

పాములై కాటేస్తాయి అంటాడీ రావెమెస్సారెల్.



మంగళం మహత్

18, ఏప్రిల్ 2011, సోమవారం

మేఘసందేశం 24 , 25 , 26 శ్లోకాలు

పాండుచ్ఛా యోపవనవృతయః కేతకై స్సూచిభిన్నై
ర్నీ డారంభైర్గృహబలిభుజామాకులగ్రామచైత్యాః,
త్వయ్యాసన్నే పరిణతఫలశ్యామజంబూవనాంతాః
సంపత్స్యంతే కతిపయదినస్థాయిహంసా దశార్ణాః


భావం:


నీవు దశార్ణదేశాల్ని చేరేటప్పటికి,

అ దేశాల తోటలు,

పూచిన మొగలిపువ్వులకాంతులతో,

తెల్లగా ఉంటాయి.

గ్రామాల్లోని రచ్చచెట్లు,

కాకులు మొదలైన పక్షులు,

గూండ్లు కట్టుకోవడంవల్ల,

కదులుతూంటాయి.

నేరేడుచెట్లు, ఫలాలతో నీలంగా ఉంటాయి.

హంసలు, ఇక కొన్నిరోజులే అక్కడ ఉంటాయి.



తేషాం దిక్షు ప్రథితవిదిశాలక్షణాం రాజధానీం
గత్వా సద్యః ఫల మవికలం కాముకత్వస్య లబ్ధా,
తీరోపాంత స్తనితసుభగం పాస్యసి స్వాదు యత్త
త్సభౄభంగం ముఖమివ పయో వేత్రవత్యా శ్చలోర్మి.



భావం:



ఆ దశార్ణదేశాలకు రాజధానియైన, విదిశాపట్టణం

అన్ని దిక్కుల్లో ప్రసిద్ధిచెందినది.

అక్కడికి నీవు పోయినప్పుడు,

కాముకునికి కలుగు ఫలమంతా కలుగుతుంది.

ఏ విధంగా అంటే,

ఆ పట్టణ సమీపంలో, వేత్రవతి అనే నది ప్రవహిస్తోంది.

మధురమైన తరంగాలతో కదులుతూంటుంది.

దాని నీటిని,

బొమముడితో కూడుకొన్న ( ప్రియురాలి )

అధరంవలె తిన్నగా ఉఱుముతూ పానం చెయ్యి.

( అలా చేసినప్పుడే, కాముకఫలం కలుగుతుంది.)




నీచై రాఖ్యం గిరిమధివసే స్తత్ర విశ్రామహేతో
స్త్వత్సంపర్కాత్పులకితమివ ప్రౌఢపుష్పైః కదంబైః
యః పణ్యస్త్రీ రతిపరిమళో ద్గారిభిర్నాగరాణా
ముద్దామాని ప్రథయతి శిలావేశ్మభిర్యౌవనాని.



భావం:



ఆ విదిశాపట్టణ సమీపంలో,

" నీచైర్గిరి " అనే పేరు గల కొండ ఉంది.

ఆ కొండమీద,

చక్కగా వికసించిన పూలు గల కడిమిచెట్లున్నాయి.

ఆ చెట్లతో ఆ కొండ,

నీ సంపర్కంవల్ల గగుర్పాటు చెందినట్లుంటుంది.

ఆ కొండమీద కాసేపు విశ్రమించు.

పణ్యస్త్రీల రతిపరిమళాల్ని వెడలగ్రక్కుతున్న,

ఆ గిరి గుహలు,

విదిశాపురజనుల అధిక యౌవనాలను ప్రకటిస్తూంటాయి.



మంగళం మహత్

17, ఏప్రిల్ 2011, ఆదివారం

మేఘసందేశం 23 వ శ్లోకం

ఉత్పశ్యామి ద్రుతమపి సఖే మత్ప్రియార్ధం యియాసో:
కాలక్షేపం కకుభసురభౌ పర్వతే పర్వతే తే
శుక్లాపాంగై: సజలనయనై: స్వాగతీకృత్య కేకా:
ప్రత్యుద్యాత: కథమపి భవాంగంతుమాశు వ్యవస్యేత్



భావం:


స్నేహితుడా!

నా ప్రీతి కోసం,

శీఘ్రంగా పోదలచినవాడవైనా,

నీకు కొడిసె పూలచేత పరిమళిస్తున్న ప్రతి పర్వతమందు,

కాలక్షేపం అవుతుందని ఊహిస్తున్నాను.

నిన్ను చూసిన ఆనందంతో,

కనుల నీరు క్రమ్మినవైన, ( ఆనందబాష్పాలతో కూడిన నేత్రాలుగల)

నెమళ్లు , తమ కేకలచేత నిన్ను,

స్వాగతం స్వాగతం అని ఎదురుసన్నాహం చేసి,

పూజిస్తాయి.

వాటిని అందుకొంటూ అక్కడే ఉండిపోక,

శీఘ్రంగా వెళ్లడానికి ప్రయత్నించు.


మంగళం మహత్

16, ఏప్రిల్ 2011, శనివారం

మేఘసందేశం 20 , 21 , 22 శ్లోకాలు

తస్యాస్తిక్తై ర్వనగజమదైర్వాసితం వాంతవృష్టి
ర్జంబూకుంజప్రతిహతరయం తోయమాదాయగచ్ఛేః
అంత:సారం ఘన తులయితుం నానిల: శక్ష్యతి త్వాం
రిక్త: సర్వో భవతి హి లఘు: పూర్ణతా గౌరవాయ.


భావం:


మేఘుడా!,

నీవు అక్కడ వర్షించిన తర్వాత,

సుగంధములైన,

అడవి ఏనుగుల మదంచేత పరిమళింపచేయబడిన,

నేరేడుపొదలచేత ఆపబడిన వేగంగల, {నేరేడుపొదలు, నర్మద వేగాన్ని ఆపుతున్నాయి.}

ఆ నర్మదానది నీటిని తీసుకొని పో.

( ఆ నీటిని గ్రహించడం వల్ల )

లోపల బలం గల నిన్ను, ( బరువుగా ఉన్న నిన్ను,)

వాయువు, కదిలించలేదు. ( చెదరగొట్టలేదు.)

రిక్తుడు ( బలం లేనివాడు ) అందఱికీ చులకన అవుతున్నాడు.

లోపల సారం ఉన్నవాడు గౌరవం పొందుతున్నాడు.




నీపం దృష్ట్వా హరితకపిశం కేసరై రర్ధరూఢై
రావిర్భూతప్రథమముకుళా: కందళీ శ్చానుకచ్ఛం
జగ్ధ్వారణ్యే ష్వధికసురభిం గంధ మాఘ్రాయ చోర్వ్యా:
సారంగాస్తే జలలవముచ: సూచయిష్యంతి మార్గం.


భావం:


సారంగాలు ( జింకలు, ఏనుగులు, తుమ్మెదలు )

సగం మొలిచిన కేసరాలతో,

కపిశవర్ణంగల ( ఆకుపచ్చ నలుపు ఎఱుపు రంగుల మిశ్రమం )

నేలకడిమి పువ్వు (ల) ను చూసి,

అలాగే,

పచ్చికపట్టుల్లో మొలిచిన తొలిమొగ్గలుగల

నేలఅరటిచెట్లను, తిని,

అడవుల్లో మిక్కిలి సువాసన గల

భూమి యొక్క గంధాన్ని మూర్కొని, ( ఆఘ్రాణించి )

ఉదక బిందువులు కురుస్తున్న నీ మార్గాన్ని సూచిస్తాయి.




అంభోబిన్దుగ్రహణచతురాం శ్చాతకా౯ వీక్షమాణా:
శ్రేణీభూతా: పరిగణనయా నిర్దిశన్తో బలాకా:
త్వామాసాద్య స్తనితసమయే మానయిష్యంతి సిధ్ధా:
సోత్కంఠాని ప్రియసహచరీ సంభ్రమాలింగితాని.


భావం:


నీవు వర్షించేటప్పుడు,

చినుకుల్ని పట్టుకోవడంలోనేర్పుగల

చాతకపక్షుల్ని చూస్తున్నవారైన,

బారులు తీరిన కొంగలను లెక్కపెడుతూ,

చేతుల్తో చూపుతున్న వారైన,

సిద్ధపురుషులు,

నీవు ఉఱిమినప్పుడు,

ఉత్కంఠతో కూడుకొన్న

ప్రియురాండ్ర సంభ్రమ ఆలింగనాలను (కౌగిలింతల్ని) పొంది,

నిన్ను పూజించగలరు.

(అడక్కుండానే స్త్రీలు వచ్చి కౌగిలించుకొంటే,

మగవాళ్లకు విశేషమైన ఆనందం కదా!

అంతకంటే కావలసినదేమున్నది?

అందువల్ల దానికి కారణమైన నిన్ను,

విశేషించి పూజిస్తారు.



మంగళం మహత్

15, ఏప్రిల్ 2011, శుక్రవారం

మేఘసందేశం 18 , 19 శ్లోకాలు

ఛన్నోపాంతః పరిణతఫలద్యోతిభిః కాననామ్రై
స్త్వయ్యారూఢే శిఖరమచలః స్నిగ్ధవేణీసవర్ణే
నూనం యాస్యత్యమరమిథునప్రేక్షణీయా మవస్థాం
మధ్యే శ్యామః స్తన ఇవ భువః శేషవిస్తారపాండుః


భావం:


అడవిమామిళ్లు పండి,

ఆ ఆమ్రకూటం చుట్టూ క్రమ్ముకొని,

తెల్లగా కనిపిస్తున్నాయి.

నున్ననైన జడతో సమానమైన వర్ణంగల నీవు,

దాని శిఖరంమీద వ్రాలినట్టైతే,

చుట్టూ తెల్లగ,

మధ్యలో నల్లగా, ఉన్నట్టి,

భూమియొక్క స్తనమో

అన్నట్లుండి,

దేవమిథునాలకు చూడ్డానికి వేడుక కలిగిస్తుంది.




స్థిత్వా తస్మి న్వనచరవధూభుక్తకుంజే ముహూర్తం
తోయోత్సర్గ ద్రుతతరగతి స్తత్పరం వర్త్మ తీర్ణః
రేవాం ద్రక్ష్యస్యుపలవిషమే వింధ్యపాదే విశీర్ణాం
భక్తిచ్ఛేదైరివ విరచితాం భూతిమంగే గజస్య.



భావం:



ఆ ఆమ్రకూటపర్వతమందు,

కిరాతస్త్రీలు, పొదరిండ్లలో విహరిస్తూంటారు.

( వారి విహారాలు చూడ్డం ఒక లాభం )

అక్కడ కొంచెంసేపు వర్షించు.

దాంతో తేలికపడి, శీఘ్రంగా పోవచ్చు.

అలా కొంతదూరం వెళ్ళిన తర్వాత,

రాళ్లతో ఎచ్చుతగ్గయిన,

వింధ్యపర్వతపాదమందు వ్యాపించి ఉన్న,

నర్మదానది,

ఏనుగు దేహమందు చేసిన సింగారంలా, కనిపిస్తుంది.

దాన్ని చూడవచ్చు.

(అది చూడ్డం మరొక లాభం.)



మంగళం మహత్

14, ఏప్రిల్ 2011, గురువారం

మేఘసందేశం 17 వ శ్లోకం

త్వామాసార ప్రశమిత వనోపప్లవం సాధు మూర్ధ్నా
వక్ష్యత్యధ్వశ్రమపరిగతం సానుమా నామ్రకూట:
న క్షుద్రో౭పి ప్రథమ సుకృతాపేక్షయాసంశ్రయాయ
ప్రాప్తే మిత్రే భవతి విముఖ: కింపునర్యస్తథోచ్చై:


భావం :



నీవు, ఆమ్రకూటపర్వతంమీద ఏర్పడిన దావాగ్నిని,

నీ ధారావర్షంచేత చల్లార్చి, ఆమ్రకూటానికి మేలు చేశావు.

కాబట్టి, మార్గాయాసంతో నీవు పోయినప్పుడు,

అతడు, నిన్ను బాగా పూజిస్తాడు. ఆదరిస్తాడు.

లోకంలో అల్పుడైనా తనకు ఉపకారం చేసిన మిత్రుడు వచ్చినపుడు,

పూజించకుండా ఉండడు.

ఇక అంతటివాడు పూజించకుండా, గౌరవించకుండా ఉంటాడా?



విశేషాలు:



ఆమ్రకూటపర్వతం మీదుగా దారి అని అర్థం చేసుకోవాలి.


మంగళం మహత్

13, ఏప్రిల్ 2011, బుధవారం

మేఘసందేశం 16 వ శ్లోకం

అక్కిరెడ్డి రాజాచంద్ర గారు ఇచ్చిన ప్రోత్సాహంతో
తిరిగి మేఘసందేశం మొదలుపెట్టాను.

"మొదలుపెట్టిన పనిని పూర్తి చేయడం ఉత్తమం అనిపించుకొంటుంది".
అని సూక్తిరత్నాకరం ఘోషిస్తోంది.
కనుక పూర్తిచేస్తాను.

రాజాచంద్ర, ch.వెంకటేశ్వరరావు (విశాఖపట్టణం)
ఇటువంటివారల కోసమైనా.



త్వ య్యాయత్తం కృషిఫల మితి భ్రూవికారా నభిజ్ఞైః
ప్రీతిస్నిగ్ధైర్జనపదవధూలోచనైః పీయమానః
సద్యః సీరోత్కషణసురభి క్షేత్ర మారుహ్య మాలం
కించి త్పశ్చా ద్వ్రజ లఘుగతి ర్భూయ ఏవోత్తరేణ


తాత్పర్యం :


"మేఘుడా!
వ్యవసాయఫలితం నీ అధీనంలో ఉన్న కారణంచేత,
కనుబొమల వికారాలు ( విలాసాలు ) తెలియని,
పల్లెలలోని వధువులు ( స్త్రీలు )
నిన్ను, ప్రీతిచేత చల్లనైన చూపులతో చూస్తారు.
అప్పుడే, నాగళ్లచేత దున్నిన కొండభూములపై
సువాసన కల్గునట్లుగా వర్షించి,
కొంచెం పశ్చిమంగా పోయి, శీఘ్రగమనంతో తిరిగి,
ఉత్తరమార్గంలో వెళ్లు.


భావం:


నీ వల్లే పైర్లు పండుతాయి.
అందువల్ల పల్లెపడుచులు,నిన్ను ప్రేమగా చూస్తారు.
భ్రూవిలాసాలు తెలియని వారి చూపులు నీకు తెలుస్తాయి.
దున్నిన కొండభూములపై నీవు వర్షిస్తే, పరిమళం కల్గుతుంది.
కొంచెం పడమరగా పోయి, తిరిగి ఉత్తరంవైపు వేగంగా వెళ్లు.


విశేషాలు:


ప్రియమిత్రులకు
గమనిక:


ఈ మేఘసందేశం చదివేటప్పుడు,
శ్లోకాన్ని+ భావాన్ని,
మౌనపఠనం కాక
బాహ్యపఠనం చేయండి.
శ్లోకం చదవడానికి భయపడకండి. (అందర్నీ ఉద్దేశించికాదు).
కూడబలుక్కుంటూనైనా పైకి చదవండి.
అపుడే దాని అందం తెలుస్తుంది.
అలాగే భావం కూడా.
విశేషాలు అక్కరలేదు. మనసులో చదువుకోవచ్చు.


---- కృషి అంటే వ్యవసాయం. ఈ రోజుల్లో దీని అర్థం మారింది.
కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. అని వేటూరి గారు వ్రాశారుగా!
"కృషితో నాస్తి దుర్భిక్షం" అని చెప్తూ కష్టపడితే దేన్నైనా సాధించవచ్చంటారు.
అసలు దాని అర్థం = వ్యవసాయం వల్ల కరవు ఉండదు. అని.

ఇది ఒక శ్లోకం మొదటిపాదం.

కృషితో నాస్తి దుర్భిక్షం జపతో నాస్తి పాతకం
మౌనేన కలహం నాస్తి నాస్తి జాగ్రతో భయం. అనేది పూర్తి శ్లోకం.


---- సరే . ఇక్కడ వ్యవసాయఫలం మేఘుని అధీనంలో ఉందంటున్నాడు.
నిజమే కదా! ఎక్కువశాతం భూములకు వర్షపునీరే గతి.
తమ పంటలు పండించే వాడిని మరి ప్రీతితో చూడరా?
ఇక్కడో ఆలోచన స్ఫురిస్తోంది.

తన కడుపు పండించిన భర్తను కూడా స్త్రీ అలాగే ప్రేమతో చల్లగా చూస్తుంది.

ఇక్కడ "వధువులు" అనే పదం వాడాడు. స్త్రీలు అని అర్థం వచ్చేలా.
పెండ్లికూతుళ్లు అనే అర్థం కూడా ఉందిగా!

అలాగే " ప్రీతిస్నిగ్ధైః లోచనైః" అన్నాడు.
అంటే ఏమాత్రం కృత్రిమం లేని ప్రేమతో తడిసిన కళ్లని అర్థం.
ఎంత అందంగా అన్నాడో చూశారా!


---- భ్రూవిలాసాలు అంటే కనుబొమలను రకరకాలుగా త్రిప్పడం.
మన హీరోయిన్స్ , హీరో కనబడగానే కళ్లతో చేసే వెకిలి వేషాలన్నమాట.
ANR ఆరాధనలో ఆరుద్ర " ఆడదాని ఓరచూపుతో జగాన
ఓడిపోని ధీరుడెవ్వడు? అన్నారు.

ఆ ఓరచూపులే భ్రూవిలాసాలు.
కృత్రిమప్రేమతో తడిలేని చూపులు.
పల్లెవనితల్లో అవి ఉండవంటున్నాడు.
అంటే అవి నాగరకస్త్రీలల్లో ఎక్కువన్నమాట.


---- ఇక మాలం అనే పదం ఉపయోగించాడు.
అంటే కొండభూమి. దున్నిన కొండభూములపై,
వర్షిస్తే సువాసన వస్తుందంటున్నాడు.
వానచినుకులు పడ్డాక తడిసిన మట్టివాసన మీరెరుగుదురుగా!
బాగుంటుంది కదా!
అయితే అది మట్టివాసన కాదుట.
భూమిపై ఉన్న అనేక పదార్థాల, బ్యాక్టీరియా, రసాయనాల
కలగలపు కంపుట. కంపు అంటే మళ్లీ చెడ్డవాసన అనుకొనేరు.
మంచి పదాన్ని కంపు కొట్టించారు.
కంపు అంటే పరిమళం/సువాసన అని అర్థం.

---- నాగళ్లచేత దున్నబడిన భూమిలో పండిన ధాన్యం , i mean బియ్యం,
రోట్లో రుబ్బిన పచ్చడిలా కమ్మగా ఉంటుంది.
ట్రాక్టరు = మిక్సీ

---- అందమైన దృశ్యాలుండే దారిని యక్షుడు
సూచిస్తున్నాడు.


---- మేఘుడు, వెళ్లేదారి.
మొదట ఉత్తరదిక్కుగా ప్రయాణం.

---- ఇపుడు కొంచెం పడమరగా తిరిగి,
మరల ఉత్తరంగా తిరగమంటున్నాడు.


గుర్తుపెట్టుకోండి.




మంగళం మహత్


ప్రజ్ఞ అంటే జరుగబోయే సంగతులను
ముందుగానే ఊహించగలిగే శక్తి.

10, ఏప్రిల్ 2011, ఆదివారం

మేఘసందేశం 16 వ శ్లోకం

క్షమించండి.

ఇక మేఘసందేశం గుఱించి వ్రాయబోవటం లేదు.











ఇది బాధ అనుకోండి. వేదన అనుకోండి.

కావ్యాలకు విలువ లేదని,
ఏ స్పందనకూ నోచుకోని
నా మేఘసందేశాన్ని చూసి ,
నాకే జాలేసి, ఇక ఆపుచేసేద్దామని
ఒక నిర్ణయానికి వచ్చాను.


రేపటినుంచి,
నేను కూడా గుంపులో గోవిందా అని
నలుగురితో నారాయణా అని అంటాను.

ఉంటాను.

రావెమ్మెస్సారెల్.

9, ఏప్రిల్ 2011, శనివారం

మేఘసందేశం 15 వ శ్లోకం

రత్నచ్ఛాయా వ్యతికర ఇవ ప్రేక్ష్య మేత త్పురస్తా
ద్వల్మీ కాగ్రా త్ప్రభవతి ధనుఃఖండ మాఖండలస్య
యేన శ్యామం వపు రతితరాం కాంతి మాపత్స్యతే తే
బర్హే ణేవ స్ఫురితరుచినా గోపవేషస్య విష్ణోః


భావం :


మేఘునితో యక్షుడు, ఇలా అంటున్నాడు.

( పద్మరాగం మొదలైన )
"రత్నాలయొక్క నానావిధాలైన కాంతులు కలసి ఉన్నట్లు,
ఎదుట ఉన్న పుట్టయొక్క కొన ( పైభాగం ) నుండి,
ఇంద్రధనుస్సు పుడుతోంది.
ఆ ఇంద్రచాపంచేత నీ దేహం,
గోపవేషం ధరించి, పింఛంతో ప్రకాశించే,
శ్రీకృష్ణుని శరీరంలా ప్రకాశిస్తుంది."


విశేషాలు :


"ఉత్తరదిక్కుగా ఎగురు" అని,
యక్షుడు, మేఘునితో చెప్తూ,

ఎదురుగా ఉన్న ఒక పుట్టకొన వివరంనుండి ( పుట్ట పైభాగంలో ఉన్న కన్నం నుండి )
ఒక ఇంద్రధనుస్సు పుట్టడం చూశాడు.
వెంటనే అందిన అవకాశాన్ని దొరకబుచ్చుకొని,
మేఘుని, ఏకంగా శ్రీకృష్ణునితో పోల్చి, పొగుడుతున్నాడు.
తెలివైనవాడు.

పని అప్పజెప్పడానికి ముందు ఒకసారి పొగిడితే చాలదన్నమాట.


యక్షుడు, వర్ణించే సమయానికి
ఇంద్రధనుస్సు ఇంకా పూర్తిగా పుట్టలేదు.
దాన్ని కాళిదాసు " ఆఖండలస్య ధనుఃఖండం " అన్నాడు.
ఆఖండలుని ధనుస్సు యొక్క ముక్క. అని అర్థం.
ఆఖండలుడు అంటే ఇంద్రుడు. శత్రువులను ఖండించువాడు అనే అర్థంలో
ఆయనకు ఆ పేరు వచ్చింది.
అందువల్ల ఇంద్రునికి విశేషణంగా ఆఖండల శబ్దాన్ని వాడి,
ధనుశ్శబ్దంతో కలిపాడు.
ఇలాంటి వాటిని ఇంతకుముందు కూడా పేర్కొన్నాను.
వీటిని సాభిప్రాయవిశేషణాలు అంటారు.


అయినా అది పూర్తి ధనుస్సు కాదు, ఖండమే.
ఇంద్రుని ప్రతాపం సగమే. ఆయనకు పూర్తి బలం ఉపేంద్రుడు. ( శ్రీకృష్ణుడు )
ఇంద్రచాపం కంటే ఉపేంద్రుని పింఛం గొప్పది.
కృష్ణపింఛం అంటే ఒక పాట గుర్తుకొస్తోంది.

ప్రక్కదారి పడుతున్నందుకు, ప్రియమైన
పాఠకులు ఏమనుకోకండి.

1943 లో వచ్చిన కృష్ణప్రేమ సినిమాలో, బలిజేపల్లి లక్ష్మీకాంతం,

"జేజేలయ్యా జోహారు కృష్ణ జేజేలయ్యా జోహారు,
కొంచెము తలపై పింఛము కదలినా ,
పంచభూతములు ప్రపంచమంతా
సంచలించునని సజ్జను లందురు.
పింఛమునకిదే ఆ పింఛమునకిదే
జే జే జే జే జేజేలయ్యా జోహారు,
కృష్ణ జేజేలయ్యా జోహారు"

అని గాలిపెంచల వారి స్వరసహాయంతో,
టంగుటూరి సూర్యకుమారిగారితో పాడించారు.


అలా సగం పుట్టిన ఆ హరివిల్లు, పింఛంలా ఉంది.
ఈ తమాషా పింఛంతో ( మేఘుని నెత్తిమీద ఉన్నట్లుంది )
నల్లని శరీరం గల మేఘుడు,
అసలు పింఛంతో ప్రకాశించే కృష్ణునిలా ( ఈయనా నలుపే )
( కృష్ణునికి మేఘునికి ఈ రెండే సామ్యాలు )
ఉన్నాడని మేఘుడు ఉబ్బేస్తున్నాడు.


మధ్యలో ఈ పొగడ్త లేంది? అని చిరాకుపడకండి.
మధ్యలో కూడా అలా కీర్తిస్తూండాలి.
ఉల్లాసం ఉత్సాహం కలిగిస్తూండాలి.


కృష్ణుని సూచించడానికి, గోపవేషం ధరించిన విష్ణువు అన్నాడు.
ఇదో చమత్కారం.
విష్ణువు అవతారాలు అన్నీ లీలలు అని సూచించడానికి కావచ్చు.
పరిశీలన జరగాలి.


అలాగే శ్లోకాన్ని పరిశీలిస్తే, కృష్ణుని శరీర వర్ణంలో
అతితరకాంతి అంటే మిక్కిలి కాంతి ఉందట.
దాన్ని మామూలు నలుపనుకోరాదు.


ఇక ఇంద్రధనుస్సు , పద్మరాగాది రత్నకాంతులతో ఉందన్నాడు కదా!

రత్నాలు 9.
మరకతం, పద్మరాగం, ముత్యం,
పగడం, నీలం, పుష్యరాగం,
వజ్రం, గోమేధికం, వైఢూర్యం.
వీటిలోని రంగులతో ఇంద్రధనుస్సును, పింఛాన్ని సరిపోల్చండి.


మంగళం మహత్


మతి అంటే వర్తమానకాలంలో
జరిగే విషయాలను
గ్రహించగల శక్తి.

8, ఏప్రిల్ 2011, శుక్రవారం

మేఘసందేశం 14 వ శ్లోకం


అద్రేః శృంగం హరతి పవనః కిం స్విదిత్యున్ముఖీభి
ర్దృష్టోత్సాహశ్చకితచకితం ముగ్ధ సిద్ధాంగనాభి:
స్థానాదస్మాత్సరసనిచులా దుత్పతోదఙ్ముఖ: ఖం
దిఙ్నాగానాం పథి పరిహర౯ స్థూలహస్తావలేపాన్


భావం :

మేఘుడా!
నీవు ( ప్రయాణానికి ) లేచినపుడు,
ముగ్ధులైన ( తెలియనివారు, అమాయకులైన )
సిద్ధవనితలు ( సిద్ధ జాతికి చెందిన స్త్రీలు ),
గాలి, కొండ శిఖరాన్ని తీసుకొని పోతున్నాడేమో?
(గాలిలో కొండ కొట్టుకొని వస్తోందేమో)
అని భయపడి చూస్తారు.
అపుడు వారి బెదరు చూపులు నీకు ఉత్సాహాన్ని కలిగిస్తాయి.
తడిసిన అనగా చల్లని ప్రబ్బలి చెట్లుగల ఇక్కడినుండి లేచి,
దిగ్గజాలు, తొండాలు విసురుతూంటే, త్రోస్తూ,
ఉత్తరదిక్కుగా ఎగురు.


విశేషాలు:

సిద్ధులు అనబడే వారు దేవతల్లో ఒక జాతివారు.

విద్యాధరులు, అప్సరసలు, యక్షులు, రక్షస్సులు, గంధర్వులు,
కింనరులు (కింపురుషులు), పిశాచాలు, గుహ్యకులు, సిద్ధులు, భూతాలు
వీరు దేవజాతివిశేషాలు. వీరి పేరును బట్టే వీరి విశేషం తెలుస్తుంది.

వీరిలో , అణిమాది సిద్ధిగలవారిని సిద్ధులు అంటారు.

అణిమాదులు మొత్తం 8 రకాల ఐశ్వర్యాలు. అవి, వరుసగా,
అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం.

వీటిని సాధిస్తే మనం కూడా సిద్ధులమవుతాం.

మేఘం కొండంత ఉందని ఇంకో చమత్కారం.

అయినా బెదరు చూపులు ఉత్సాహాన్ని ఇవ్వడం ఏమిటి?
ఒకరి బెదరు ఒకరికి వేడుకా? అంతే

మఱి, మర్యాదరామన్నలో సునీల్ ఎంతలా "భయపడితే" ఆడియన్స్ అంతలా
"ఎంజాయ్" చేశారు కదా!

నిచులవృక్షాలనే ప్రబ్బలి అని, వేతసాలని, ఎఱ్ఱగన్నేరని, నీటిగన్నేరని అంటారు.
వీటిలో మిగతా చెట్లకంటే నీటి శాతం బాగా ఎక్కువగా ఉంటుంది.


మేఘుడు దిగ్గజంలా ఉన్నాడని, ( కవి చమత్కారం )
దాన్నిచూసి, మరో ఏనుగేమో అని
దిక్కుల్ని మోసే ఏనుగులు తమ తొండాలను విసిరితే,
వాటిని త్రోస్తూ, పొమ్మంటున్నాడు.

మనకు ప్రధాన దిక్కులు 4.విదిక్కులు 4. వీటి వరుసను , వీటిని మోసే ఏనుగుల వరుసను చెప్తే,
వాటిని ఇలా చెప్పాలి.

తూర్పు        ఐరావతం
ఆగ్నేయం    పుండరీకం
దక్షిణం        వామనం
నిరృతి         కుముదం
పడమర      అంజనం
వాయువ్యం పుష్పదంతం
ఉత్తరం        సార్వభౌమం
ఈశాన్యం     సుప్రతీకం


"దిగ్గజాల (తొండాల)నే త్రోసిరాజనేవాడవు నీవు" అని
నర్మగర్భంగా మేఘుని పొగుడుతున్నాడు.


పండితులు ఈ శ్లోకంలో ఇంకో విశేషం ఉందంటారు.
తగ్గించి చెప్తాను.


కాళిదాసుకు ఒక శత్రువు ఉన్నాడు. అతని పేరు దిఙ్నాగుడు.
అతడు కాళిదాసు రచనల్లో దోషాలు ఎత్తి చూపిస్తూండేవాడు ఆ రోజుల్లో.

అయితే కాళిదాసుకు,
నన్నయకు నారాయణభట్టు లాగ, కె.వి.మహదేవన్ కు పుహళేంది లాగ,
ఎమ్.ఎస్. సుబ్బులక్ష్మిగారికి సహ గాయని రాధ గారిలాగ,
ఒక చక్కని పండిత మిత్రుడూ ఉన్నాడు.

అతడి పేరు నిచుళుడు. ఇద్దరూ కలిసి చదువుకొన్నారు.
కాళిదాసు రచనల్లో ఇతరులు ఆరోపించే దోషాలను ఇతడు త్రిప్పికొడుతూండేవాడు.

ఇది దృష్టిలో పెట్టుకొని, కాళిదాసు తనలో తాను అనుకొన్నట్లుగా,
శ్లోకభావాన్ని చూస్తే,

" నిచుళుడు ఉండగా దోషాలను ఆరోపించేవారెవరు? కాబట్టి ధైర్యంగా నామార్గంలో నేను మేఘసందేశాన్ని రచిస్తా.
లావైన చేతులు త్రిప్పుతూ, దిఙ్నాగుడు చేసే దూషణాలను నివారిస్తూ,
కొండలాంటి అతని ప్రాధాన్యాన్ని పోగొట్టడంతో,
సుందరులైన సాహిత్య సిద్ధులును, స్త్రీలును నీ ఉత్సాహం చూసేటట్లుగా
ప్రసిద్ధి పొంది ఉండు."


మంగళం మహత్


స్మృతి అంటే జరిగిన విషయాలను
గుర్తుకుతెచ్చుకొనగలిగే శక్తి.

7, ఏప్రిల్ 2011, గురువారం

మేఘసందేశం 13 వ శ్లోకం


మార్గం తావచ్ఛృణు కథయత స్త్వత్ప్రయాణానురూపం
సందేశం మే తదను జలద శ్రోష్యసి శ్రోత్రపేయం
ఖిన్నఃఖిన్నః శిఖరిషు పదం న్యస్య గంతాసి యత్ర
క్షీణః క్షీణః పరిలఘు పయః స్రోతసాం చోపభుజ్య

భావం :
 మేఘుడా ! ఇప్పుడు, నీ ప్రయాణానికి అనుకూలమైన మార్గాన్ని చెప్తాను.

"
ఆ తరువాత వినడానికి ఇంపైన సందేశాన్ని చెప్తాను.
నేను చెప్పబోయే మార్గంలో, నీకు శ్రమ కలిగినప్పుడు,
పర్వతాలమీద నిలిచి, విశ్రాంతి తీసుకొనివెళ్లవచ్చు.
క్షీణించిపోతే ( చిక్కిపోతే ) నదుల్లో మిక్కిలి తేలికైన నీరు త్రాగి, వెళ్లవచ్చు.
కాబట్టి, ఈ మార్గం నీకు హితంగా ఉంటుంది

విశేషాలు:
ప్రయాణం చేయదలచుకొన్నవారు,
మొదట ఒక ప్రణాళిక ( plan ) వేసుకోవాలి.
ఒక గమ్యానికి ఉన్న అనేకానేక మార్గాల్లో
అనుకూలమైన దాన్ని ఎంచుకోవాలి.లేడికి లేచిందే పరుగన్నట్టు,
గుడ్డెద్దుచేలో పడ్డట్టు పడి పోకూడదు.
 అపుడే క్షేమంగా ప్రయాణం జరుగుతుంది.
ఇప్పటి సౌకర్యాలు లేని పుర్వకాలం ప్రయాణాల్లో,
తాగునీరు లభ్యమయ్యే దారిని,
అలాగే ఆశ్రయమిచ్చేవారు,/సత్రాలున్న దారిని
ఎంచుకొనేవారని అర్థమవుతుంది.

చిక్కిపోతే, తేలికైన నీరు తాగమంటున్నాడు.
తేలికైన అనే అర్థంలో "పరిలఘు" అనే పదాన్ని కవి ప్రయోగించాడు.
నీరు తేలిక ఎప్పుడవుతుంది? ఆవిరైనపుడే కదా ?
ఆ ఆవిరే కదా మేఘం.సూక్ష్మవిషయాలను కూడా పరిగణన లోకి తీసుకొని , కాళిదాసు వ్రాస్తున్నాడు.నీరు తగ్గిపోతే మేఘం చిక్కిపోతుంది.
మరల ఆవిరితో రూపు కడుతుంది.


ఇక యక్షుడు, తన సందేశం వింటే,
అమృతం త్రాగినట్లు ఆనందం కలుగుతుందంటున్నాడు.
ఎందుకంటే అంతదూరం కష్టపడి వెళ్ళాక,
"ఆమెకు అందించడానికి తగిన విధంగా సందేశం ఉంటుందా ?"
అని మేఘుడు సందేహ పడకుండా.

ఇప్పటికే పాఠకుల్లో కొంతమందికి,
యక్షుడు ఇంత హడావిడి చేస్తున్నాడు.
అంతా అయ్యాక "నేను కులాసా ,
ఆవిడ కులాసా కనుక్కో" అంటాడేమో అనిపించిఉంటుంది.
అఫ్ కోర్స్ అదీ సందేశమే, కానీ చప్పగా ఉంటుంది కదా!
ఆ భయం అక్కరలేదు.

రెండవ సర్గలో 40 వ శ్లోకం నుంచి 52 వ శ్లొకం వరకు 13 శ్లోకాల్లో
యక్షుని సందేశాన్ని కాళిదాసు పొందుపరిచాడు.
అది బాగుందో బాగులేదో మీరే చెప్దురుగాని.
మఱి, మీరు మరికొంత కాలం ఆగాలి.

మంగళం మహత్

స్మృతి, మతి ప్రజ్ఞ అనే మూడుశక్తుల కలయికే బుద్ధి.
రచనకు ఇవి గొప్పగా ఉపకరిస్తాయి.


6, ఏప్రిల్ 2011, బుధవారం

మేఘసందేశం 12 వ శ్లోకం

ఆపృచ్ఛస్వ ప్రియసఖ మముం తుంగ మాలింగ్య శైలం
వంద్యైః పుంసాం రఘుపతిపదైః రంకితం మేఖలాసు
కాలే కాలే భవతి భవతా యస్య సంయోగ మేత్య
స్నేహ వ్యక్తి శ్చిర విరహజం ముంచతో బాష్ప ముష్ణం.

భావం :

ఓ మేఘుడా!
ఈ చిత్రకూట పర్వతం,
నీకు ప్రియ సఖుడు,
ఉన్నతుడు,
( అందరిచేత నమస్కరింపదగిన ) శ్రీరాముని పాదస్పర్శచేత, పవిత్రుడు,
నీవు వచ్చినపుడు ఆనందించేవాడు,
కాబట్టి ఇతని ఆలింగనం చేసుకొని,
పోయి వస్తానని వీడుకొను.

విశేషాలు :

యక్షునికి, మేఘునికి ఇరువురికి ప్రస్తుతం ఆశ్రయమిస్తున్నవాడు చిత్రకూటం.
కాబట్టి, తనకూ ప్రియసఖుడే.
మేఘునికీ ప్రియసఖుడే. ( పర్వతాలను తాకుతూ తిరుగుతాయి కదా! మేఘాలు. అలా మిత్రత్వం.)
అలాగే రామునికీ ఆశ్రయం ఇచ్చినవాడు కాన, రామునికీ ప్రియసఖుడే.

ఇక ఉన్నతుడు.
అంటే ఆకారం చేత ఎత్తైనవాడు అని,
తన గుణాలచేత గొప్పవాడైనవాడు అని చెప్పుకోవచ్చు.
అన్నింటికంటే రాముని పాదాలను శిరస్సున ధరించి ,
ఇంకా ఉన్నతుడయ్యాడు.

రామపాదస్పర్శచేత పవిత్రుడు అయ్యాడు.
మిత్రత్వం , మహత్త్వం , పవిత్రత్వం ఉన్నవారు సంభావనార్హులు. గౌరవించదగినవాళ్లు.

" ఈ చిత్రకూటం, ప్రతి వర్షాకాలంలోను నీతో కలిసి ఉంటాడు.
వర్షాకాలం పూర్తి అయ్యాక , చాలకాలం నిన్ను, ఎడబాసి ఉంటాడు.
అందువలన పుట్టిన వేడైన కన్నీటిని ( ఆవిరిని )
(ఇపుడు మరల నీ స్నేహం లభించడంతో ) విడిచిపెడుతూ , ప్రేమను వ్యక్తీకరిస్తున్నాడు.
" ( ఇదంతా భావంలో వ్రాయక " నీవు వచ్చినపుడు, ఆనందించేవాడు." అని పేర్కొనడం జరిగింది.)

అటువంటి చిత్రకూటాన్ని కౌగలించుకొని వీడ్కొల్పు, అంటున్నాడు.

ప్రయాణసమయాల్లోని మర్యాదలను తెలియజేస్తున్నాడు.

ఇంతకుముందు శకునాలు, ఇపుడు వీడ్కొల్పులు.

మంగళం మహత్

ప్రతిభ , వ్యుత్పత్తి , అభ్యాసం - వీటి గొప్పతనాన్ని బట్టి రచన గొప్పతనం ఆధారపడిఉంటుంది.

5, ఏప్రిల్ 2011, మంగళవారం

మేఘసందేశం 11 వ శ్లోకం

కర్తుం యచ్చ ప్రభవతి మహీముచ్ఛిలీన్ధ్రా మవంధ్యాం 
తచ్ఛృత్వా తే శ్రవణసుభగం గర్జితం మానసోత్కాః 
ఆకైలాసా ద్బిసకిసలయచ్ఛేదపాథేయవంతః 
 సంపత్స్యంతే నభసి భవతో రాజహంసాః సహాయాః


అవతారిక : నీకు, దారిలో సహాయం చేసేవారున్నారంటున్నాడు.

భావం :

మేఘుడా! నీ ఉఱుము, శిలీంధ్రాలను పుట్టిస్తుంది. 
అలా భూమిని ఫలవంతంగా చేస్తుంది. 
అపుడు భూమి అవంధ్య అవుతుంది. ( అవంధ్య = సంతానం కలది )  
ఇంకా వినడానికి కూడా నీ ఉఱుము సొంపుగా ఉంటుంది. 
అటువంటి నీ ఉఱుమును విని,  
మానస సరోవరానికి ఎప్పుడెప్పుడు పోదామా? 
అని ఆత్రపడే రాజహంసలు, 
లేత తామరతూండ్లముక్కల్ని, దారిబత్తెంగా చేసుకొని, 
కైలాసపర్వతం దాకా ఆకాశంలో, 
నీకు, (సహాయంగా) కూడా రాగలవు.





విశేషాలు :



ఉఱుముకి శిలీంధ్రాలకు సంబంధం ఉందా? 
సైన్స్ పండితులు తేల్చాలి. 
కేవలం ,పదాలను అనుసరిస్తే 
ఉఱుముకి, శిలీంధ్రాలను పుట్టించే శక్తి ఉంది.  
ఉఱిమిన మేఘం ఆ వెనుక వర్షిస్తుంది 
కాబట్టి శిలీంధ్రాలు పుడతాయి. 
ఆ విధంగా ఉఱుము పంటలకు కారణమౌతుంది.

ఉఱుము వినడానికి సొంపుగా ఉంటుందంటారా?
వర్షాలకోసం ఎదురు చూచేవారికి వినసొంపే మఱి.

ఇక రాజహంసలు : పక్షుల్లోనే శ్రేష్ఠమైనవి. అందమైనవి.
వాటి ముక్కు, కాళ్లు ఎఱ్ఱగా ఉంటాయి. శరీరం అంతా తెలుపు.

లేత తామరతూండ్లు వాటికి ఆహారం . అటువంటివి కూడా వస్తాయి.

వాటితో కలసి ప్రయాణం.

మేఘునకు ఉత్సాహం కల్గిస్తున్నాడు.

ఒక్కరూ ప్రయాణించేకంటే , నలుగురు కలసి ప్రయాణిస్తే, అలసట తెలియదు కదా!



ఇక్కడ రాజహంసల గుఱించి వివరణ

రాజహంసలకు, మంచు ( యొక్క దుష్టత్వం ) రోగాలను కలుగజేస్తుంది. ఆ కారణంగా అవి, ఇతరప్రాంతాలకు

పోయి, మరల వర్షాలు పడే సమయానికి మానససరోవరానికి ప్రయాణం కడతాయి.

ఆ ప్రయాణం ఎపుడెపుడా అని ఎదురు చూస్తాయి.

మఱి, వాటికి మేఘగర్జన వినసొంపే కదా!



దారిబత్తెం అంటే దారిలో (తినడానికి తెచ్చుకొన్న) భోజనం.

ముందుజాగ్రత్త కల ప్రయాణికులు, దొరుకుతుందో దొరకదో అనే సందేహంతో ఆహారాన్ని కూడా తెచ్చుకొంటారు.

అలా హంసలకు తామరతూండ్లు - దారిబత్తెం.



రామగిరి నుండి కైలాస మానససరోవరం వఱకు ప్రయాణం అని ప్రస్తుతానికి తెలిసింది.

మంగళం మహత్

సాహిత్యం బాగా చదివిన వాళ్లు కవిత్వాన్ని బాగ వ్రాస్తారు.





4, ఏప్రిల్ 2011, సోమవారం

మేఘసందేశం 10 వ శ్లోకం

తాం చావశ్యం దివసగణనాతత్పరా మేకపత్నీ
మవ్యాపన్నా మవిహతగతి ర్ద్రక్ష్యసి భ్రాతృజాయాం
ఆశాబంధః కుసుమసదృశం ప్రాయశో హ్యంగనానాం
సద్యః పాతి ప్రణయి హృదయం విప్రయోగే రుణద్ధి.

భావం : ప్రేమ కలిగిన స్త్రీల బ్రతుకు, పుష్పంతో సమానమైనది.
భర్తలతో వియోగం ఏర్పడినపుడు,
వారి బతుకుపుష్పం రాలిపోతుంది.
అయితే తొడిమ, పువ్వును రాలిపోకుండా పట్టి, ఉంచుతూంటుంది.
ఆ తొడిమే ( భర్త తప్పక తిరిగి వస్తాడు అనే ) ఆశ.
అలాగే - పతివ్రత, నీకు వదినె అయిన, నా భార్య కూడా
నేను రావడానికింకా ఎన్ని రోజులున్నాయో అని లెక్కిస్తూ,
ప్రాణం ధరించి ఉంటుంది.
అటువంటి ఆమెను నీవు తప్పక చూడగలవు.


విశేషాలు : - (99%) ఎక్కువ శాతం మగవాళ్ళకు తమ భార్యలమీద నమ్మకం ఉండదు.
పతివ్రతలు ఎవరు అని చెప్పమంటే
అరుంధతి, అనసూయ అంటారే గాని
"నా భార్య " అని మొదటగా చెప్పగలడా? ఏ మగాడైనా!
అదే మగవారి స్వభావం.
మరి ఎంత నమ్మకం!
యక్షునికి తన భార్య మీద.


- పతివ్రతల దర్శనం పరమ పవిత్రమైనది.
పుణ్యప్రదమైనది.

- ఇక్కడ మేఘునితో యక్షుడు, బంధుత్వం కలిపాడు.
"నేను నీ సోదరుడిని" అంటున్నాడు.
కాబట్టి యక్షునిభార్య , మేఘునికి వదినె అయింది.
వరుస కలుపడం ఎందుకంటే ,
పరాయి స్తీని చూడవచ్చా? అన్న సందేహాన్ని మేఘునకే కాదు.
మనకూ తీరుస్తున్నాడు.
వదినె, తల్లితో సమానం.
( గురువుగారి భార్య, భార్య యొక్క తల్లి, అన్నగారి భార్య, రక్షించిన వాని భార్య, పితృపత్ని అనగా కన్నతల్లి
- వీరు పంచమాతలు.)

తల్లి అని భావన చేస్తూ, వీరిని చూసినా , వీరితో మాట్లాడినా దోషం లేదు.
కాబట్టి శంక లేక చూడవచ్చు.


- భర్త అనే చెట్టుకు, భార్య, పూచిన పువ్వు.
చెట్టుకు పువ్వుకు మధ్య తొడిమ ( బంధం ) - ఆశ ( ప్రేమ ).


- మొదట మిత్రత్వం, తరువాత బంధుత్వం
క్రమంగా సూచింపబడింది.


మంగళం మహత్

పాలసముద్రాన్ని మథిస్తేనే కదా! అమృతం పుట్టింది.

3, ఏప్రిల్ 2011, ఆదివారం

మేఘసందేశం 9 వ శ్లోకం

మందం మందం నుదతి పవన శ్చానుకూలో యథా త్వాం
వామశ్చాయం నదతి మధురం చాతకస్తే సగంధః
గర్భాధానక్షణపరిచయా న్నూనమాబద్ధమాలాః
సేవిష్యంతే నయనసుభగం ఖే భవంతం బలాకాః

ముందుమాట : శుభశకునాలు కనబడుతున్నాయి.
పని, పూర్తి అవుతుందంటున్నాడు.

భావం : మేఘుడా! నీకు అనుకూలంగా గాలి వీస్తోంది.
అంటే ముందుకు వెళ్ళేలా త్రోస్తోంది.
చాతకపక్షి, మధురంగా కూస్తోంది. ( ఈ రెండు శుభశకునాలు అయ్యాయి.
ఇంకో సుశకునం అవుతుందంటున్నాడు.)
ఆడుకొంగలు, కన్నులకు ఇంపైన నిన్ను, తప్పక సేవిస్తాయి.

విశేషాలు : - ప్రయాణసమయం కాబట్టి, శకునాల గుఱించి, ప్రస్తావిస్తున్నాడు.
శకునశాస్త్రం ప్రకారం
అనుకూలమైన గాలి, చాతకపక్షి కూత, కొంగలు కనబడ్డం, శుభశకునాలు.
( శకునాల గుఱించి తరువాత చర్చిద్దాం )

- శ్లోకం చూడండి.
నుదతి = త్రోస్తోంది
పవనః = గాలి
మందం = మెల్లగా
నదతి = పలుకుతోంది
చాతకః = చాతకపక్షి
మధురం = మధురంగా
" అక్షరరమ్యత " అనవచ్చు.
ఇది సంస్కృతంలో మాత్రమే ఉన్న సౌలభ్యం.

- గాలినిబట్టే కదా! మేఘం నడక.

- చాతకపక్షిని వానకోయిల అంటారు.
ఈ పక్షి, వాన పడుతున్నప్పుడు మాత్రమే నోరు తెరచి, ఆ వాన నీటిని త్రాగుతుంది.
ఈ విధంగా మేఘానికి చాతకానికి సంబంధం ఉంది.
అందువల్ల " సగంధః " ( సంబంధం ) పదం వాడాడు.

- ఇక కొంగలకు మేఘం కన్నులకు ఇంపు (అందం) అన్నాడు
కాని , నల్లని మేఘాలతో ఆకాశం నిండి ఉన్నప్పుడు, తెల్లనికొంగలబారు మన కన్నులకు ఇంపు కదా!
" నల్లని మబ్బులు గుంపులు గుంపులు తెల్లని కొంగలు బారులు బారులు "
అని దేవులపల్లి వారు "మల్లీశ్వరి "చేత అనిపించింది, మేఘసందేశ ప్రభావంతోనే.
గగనసీమల తేలు ఓ మేఘమాలా! అని పంపించుకొన్న
మల్లీశ్వరి నాగరాజుల పరస్పరసందేశాలకు ఆధారం మేఘ(సందేశ ప్రభావ) మే .


మంగళం మహత్


పిండి కొద్దీ రొట్టె - యోచన కొద్దీ భావం.

2, ఏప్రిల్ 2011, శనివారం

మేఘసందేశం 8 వ శ్లోకం

త్వామారూఢం పవనపదవీముద్గృహీతాలకాంతాః

ప్రేక్షిష్యంతే పథికవనితాః ప్రత్యయాదాశ్వసన్త్యః

కః సన్నద్ధే విరహవిధురాం త్వయ్యుపేక్షేత జాయాం

న స్యాదన్యో౭ప్యహమివ జనో యః పరాధీనవృత్తిః



తొలిపలుకు : "నా పని గుఱించి వెళ్తున్నపుడు నీకొక లాభం కలుగుతుం"దంటున్నాడు.


భావం : నీవు నాపని మీద ఆకాశంలో పోతూండగా,
బాటసారుల స్త్రీలు
( అనగా తమ పురుషులు దూరదేశాలకు పోయినందువల్ల ఇంట ఉండి, విరహాన్ని అనుభవిస్తున్నవారు ),
(నిన్ను చూడగానే తమ ప్రియులు వస్తారు అనే )
నమ్మకం వల్ల ఊఱడిల్లుతున్నవారై,
ముంగురుల కొనలు ఎత్తి పట్టుకొని, (నిన్ను) చూడగలరు.
నీవు వ్యాపిస్తూండగా,
విరహంతో బాధపడుతున్న ప్రియురాలిని ఎవడు ఉపేక్షిస్తాడు?
ఎవడు కూడా నాలా పరాధీనవృత్తి గలవాడు ( స్వాతంత్ర్యం లేనివాడు ) ఉండడు.

విశేషాలు. - ఇక్కడ మేఘునికి ఏమి లాభమయ్యా అంటే,
విరహంలో ఉన్న స్త్రీలకు తన దర్శనంతోనే విరహతాపం కొంత తగ్గుతుంది.
మఱి ఆ పుణ్యం తనదే కదా!
- మేఘునికి ఒక తాయిలం. పుణ్యం దక్కడం అన్నది.

- " పవనపదవీం ఆరూఢం త్వాం " = ఆకాశాన్ని ఎక్కిన నిన్ను ( శ్లోకం చూడండి )
యక్షుడు, మేఘుని, పదవికి ఎక్కిస్తున్నట్టు,
అదికూడా రాయబారపదవి (అనవచ్చా?) అని తోస్తోంది కదా!

- విరహంలో ఉన్న స్త్రీలే అని ఎందుకనాలి?
పురుషులు అనలేదేమి? మేఘుడు పురుషుడేగా!
ఆడవారు నిన్ను ముంగురులు ( ముంగురులు అంటే ముందుకురులు / నుదిటిమీద పడే వెంట్రుకలు. వాటిని) వెనక్కి తోసుకొంటూ చూస్తారంటే
( ఎంత అందం ? మీకు రాజ్ కపూర్, డింపుల్ ల బాబీ గుర్తుకొచ్చిందా! డింపుల్ పరిచయదృశ్యం.
తలుపు తీసి, రిషిని అలాగే చూస్తుంది.) ఆనందించడా?

- బాటసారుల స్త్రీలు అని అర్థం వచ్చేలా " పథికవనితలు" అన్నాడు కాళిదాసు.
చక్కగా వాడాడు.
తమ ఆడవారిని విడిచివెళ్ళిన వారనే కాదు.
తమవారి వద్దకు తిరిగి వస్తూ మార్గమధ్యంలో ( బాటనడిమిని ) ఉన్నవారు కూడా బాటసారులే కదా!

- పరాధీనవృత్తి ఎంత అసహ్యమో, (అసహ్యం అంటే సహించలేనిది)
స్వాధీనవృత్తి ఎంత హాయో, తెలియజేస్తున్నాడు.

- తన పొందు కోసం అపేక్ష పడుతున్న భార్యను,
వివేకవంతుడు, ఉపేక్షింపడు.
ఉపేక్షిస్తే, అది అధర్మం.
( అనర్థాలు జరిగే అవకాశాలనూ కాదనలేం. )

మంగళం మహత్

విశ్వానికి శ్రేయస్సును కలిగించేదే కావ్యం.

1, ఏప్రిల్ 2011, శుక్రవారం

మేఘసందేశం 7 వ శ్లోకం

మేఘసందేశం 7 వ శ్లోకం

సంతప్తానాం త్వమసి శరణం తత్పయోద ప్రియాయా
స్సందేశం మే హర ధనపతి క్రోధవిశ్లేషితస్య
గంతవ్యా తే వసతి రలకా నామ యక్షేశ్వరాణాం  
బాహ్యోద్యానస్థితహరశిరశ్చంద్రికాధౌతహర్మ్యా

భావం :

మేఘుడా!
( ఎండ/విరహంచేత ) తపించినవారికి, ( తాపం పొందిన వారికి ) శరణం అవుతున్నావు.
ఆ కారణంవల్ల,
ధనపతి ( కుబేరుని ) కోపంచేత ఎడమైన నా సందేశాన్ని, ప్రియురాలికి అందించు.
( పట్టణానికి ) వెలుపల ఉన్న తోటలో ఉన్న శివుని శిరస్సునందలి వెన్నెలచేత, శుభ్రములైన మేడలుగల, యక్షేశ్వరులకు స్థానమైన,
అలకా అని పేరు గల పట్టణం నీకు పోతగినది.

వ్యాఖ్యావిశేషాలు :

- ఎండబాధకు నీరు, విరహబాధకు చల్లదనం, ఇస్తున్నాడు. దగ్గరకు చేరుస్తున్నాడు.
( పయోద అంటే నీటిని ఇచ్చునది = మేఘం )

- ఇక్కడ కుబేరుని కోపమే యక్షుని తపింపచేసిన ఎండగాను,
విరహబాధను కలుగచేసిన కారణంగాను భావించవచ్చు.

- "శరణం" తిరుగులేని అస్త్రం.
సంతప్తులకు నీవు శరణం అన్నా,
తాను సంతప్తుడే కనుక ఆ శరణం తనకే ఇమ్మని.

- 1 నుండి ఈ 7 శ్లోకాలలో ఇంతవరకు కుబేరుని, 3 సార్లు కాళిదాసు,
అర్థవంతమైన విశేషణాలతో సంబోధించాడు.
మొదటి శ్లోకంలో "భర్త" అని సంబోధించాడు. అనగా యజమాని.
యజమానికి కోపంవస్తే, శిక్ష విధిస్తాడు. అంతవరకే.
మొదటి శ్లోకంలో కూడా భర్తృశాపం అన్నాడు.
3 వ శ్లోకంలో కుబేరుని "రాజరాజు" అని అంటాడు.
రాజుకు కోపంవస్తే, దేశబహిష్కారశిక్ష కూడా విధించే అధికారం గలవాడు.
కాన ఇప్పుడు యక్షుడు "దూరసంస్థే" అని ( ప్రియురాలు దూరప్రదేశంలో ఉంది) మేఘునితో చెప్పాడు.
ఈ 7 వ శ్లోకంలో "అలకాపురి" వెళ్ళాలని చెప్తున్నాడు.
మఱి ఆ పురి కుబేరునిది
కాన ఆయనను " ధనపతి " అని సంబోధించాడు.
దేవతలలో ధనానికి అధిష్ఠానదేవత కుబేరుడు.
కాబట్టి ఆ పట్టణం గొప్పతనం "ధనపతి" పదంతో చెప్పకనే చెప్పాడు.

- కుబేరుడు శివభక్తుడు. ఆ విషయం ఇక్కడ తెలుస్తుంది.

- అలకాపురి ఉద్యానంలో శివుడున్నాడని,
ఆయన ధరించిన చంద్రుని వెన్నెలతో అక్కడి మేడలు, కడుగబడినవి ( ధౌత ) అని వర్ణించడం ద్వారా,
అసలైన కవిత్వంలోకి, వర్ణనలలోకి తాను ప్రవేశిస్తున్నానని ,
ఇకనుంచి చెప్పబోయే శ్లోకాలు ,
వెన్నెలచేత కడుగబడిన అలకాపురి మేడల్లాంటివని కాళిదాసు సూచిస్తున్నాడు.

భావనాశక్తిని బట్టి భావం అర్థమవుతుందని ఆర్యులంటారు.

మంగళం మహత్

Sundarakanda సుందరకాండ 35

                                     రామసుందరం పఞ్చత్రింశస్సర్గః తాం తు రామకథాం శ్రుత్వా వైదేహీ వానరర్షభాత్‌ । ఉవాచ వచనం సాంత్వ మిద...